హైదరాబాద్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట సమీపంలో ప్రైవేట్ బస్సు, కంటైనర్ లారీ ఢీకొనడంలో ముగ్గురు మృతి చెందగా, పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో టైర్ పేలి ఈ విషాదం సంభవించిందని నివేదికలు సూచిస్తున్నాయి. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, డివైడర్ను దాటుకుని, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి.
బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, లారీ క్లీనర్ మరణించారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అదేసమయంలో ఆ దారిలో ప్రయాణిస్తున్న DCM ట్రక్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీరోచిత ప్రయత్నంలో పది మందికి పైగా కిటికీల నుండి దూకి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.
మంటల కారణంగా బస్సులోనిప్రయాణికుల సామానులన్ని దగ్ధం అయ్యాయి. స్థానికుల హెచ్చరికతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.


