చెన్నై: రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం చేసే పద్ధతిని రద్దు చేస్తూ… రాజ్యాంగ సవరణను ప్రతిపాదించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో డిఎంకె సంప్రదింపులు జరుపుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో గవర్నర్లు, ఎన్నికైన ప్రభుత్వాల మధ్య ఇటీవల జరిగిన వరుస ఘర్షణలపై స్పందిస్తూ… గవర్నర్లు “పార్టీ ఏజెంట్లు”గా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తున్నారని సిఎం స్టాలిన్ ఆరోపించారు.
“ముందు తమిళనాడు, తర్వాత కేరళ, ఇప్పుడు కర్ణాటక…వారి ఉద్దేశం స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తయారుచేసిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించిన గవర్నర్లు పార్టీ ఏజెంట్ల వలె ప్రవర్తిస్తున్నారు, సక్రమంగా ఎన్నికైన ప్రభుత్వాలను బలహీనపరుస్తున్నారు” అని సిఎం స్టాలిన్ రాశారు.
గవర్నర్ ప్రసంగంతో తొలి అసెంబ్లీ సమావేశాన్ని ప్రారంభించే ఆచారం “నిరుపయోగంగా, అసంబద్ధంగా” మారిందని, రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని రద్దు చేయాలని ఆయన అన్నారు.
పార్లమెంట్ తదుపరి సమావేశంలో సవరణను కొనసాగించే లక్ష్యంతో, ఇలాంటి ఆందోళనలను పంచుకునే ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపడంలో డిఎంకె ముందుంటుందని ముఖ్యమంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకారం… గవర్నర్ ప్రసంగాన్ని పదేపదే అంతరాయం కలిగించడం వల్ల సమావేశం ప్రజాస్వామ్య పాలన ఆచారబద్ధమైన పునరుద్ఘాటనగా కాకుండా రాజకీయంగా ఒక ఉద్రిక్తతగా మారింది.
ఈ వారం ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ఆర్.ఎన్. రవి తన ప్రారంభ ప్రసంగాన్ని పూర్తి చేయడానికి ముందే వాకౌట్ చేసిన నాటకీయ సంఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
జాతీయ గీతం వినిపించనప్పుడు తనను అగౌరవపరిచారని, తన మైక్రోఫోన్ ఆపివేసారని, దీంతో తాను సభ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చిందని గవర్నర్ ఆరోపించారు.
తమిళనాడు స్పీకర్ ఎం. అప్పావు… గవర్నర్ రవిని శాసనసభ సమావేశాల సంప్రాదాయాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఇది రాజకీయ రగడకు దారితీసింది.
ఈ సంఘటన తీవ్ర రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. రాజ్ భవన్ వాకౌట్ను సమర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగంలో దళితులపై హింస వంటి అంశాల ప్రస్తావనలు తొలగించారని ఆరోపించింది.
ఈ వివాదం ప్రతిపక్ష సభ్యులకు కూడా వ్యాపించింది, శాంతిభద్రతల గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తూ అన్నాడీఎంకే నాయకులు వాకౌట్ చేశారు.
గవర్నర్లు, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపాదన భారతదేశ సమాఖ్య ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంప్రదాయాలను పునఃపరిశీలించాలనే విస్తృత ప్రయత్నానికి సంకేతం ఇస్తుంది.


