మసాచుసెట్స్/అమెరికా: తెలంగాణ ముఖ్యమంత్రి విద్యార్థిగా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టారు. విజ్ఞాన సముపార్జన కోసం ఆయన మళ్లీ స్టూడెంట్గా మారాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. ఇక్కడి కెనడీ స్కూలులో ‘లీడర్షిప్ 21- సెంచరీ’ అనే కోర్సును అభ్యసిస్తున్నారు.
ఈనెల 25 నుంచి 30 వరకు జరిగే ఈ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో సీఎం ఠంచనుగా పాల్గొంటున్నారు. క్లిష్టమైన సమస్యల పరిష్కారం, ప్రజలను ప్రభావితం చేయడం వంటి అంశాలపై ఈ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారు.
ఈ కోర్సులో భాగంగా కోర్సులో తొలిరోజు అధికారిక విశ్లేషణ- నాయకత్వం అంశంపై తొలి సెషన్ ముగిసింది. ఇందులో కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. మళ్లీ నేటి ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయని, సాయంత్రం 6 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ కోర్సు కోసం ఐదు ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరందరితో కలిసి సీఎం రేవంత్ క్లాసులకు హాజరయ్యారు. సీఎం పదవిలో కొనసాగుతూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఒక కోర్సు సర్టిఫికెట్ అందుకున్న సీఎంగా రేవంత్ రికార్డు సృష్టించనున్నారు.
కాగా, దావోస్లో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకున్న తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే.
మరోవంక రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో చేరడంపై బీజేపీ విమర్శించింది. ఈమేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన ప్రతినిధి ఎన్. వి. సుభాష్ మాట్లాడుతూ… నాయకత్వం… స్వల్పకాలిక కోర్సుల ద్వారా పొందలేరు. కానీ పాలన, జవాబుదారీతనం, క్షేత్రస్థాయిలో ఫలితాల ద్వారా లీడర్షిప్ సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.
“అటువంటి విద్యాపరమైన పనులు జీవితంలో ముందుగానే పూర్తి చేసుకొని ఉండాల్సింది కదా?” అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ముఖ్యమంత్రి ప్రాథమిక తరగతి గది విదేశీ క్యాంపస్ కాదు, ఆయన పరిపాలించే రాష్ట్రం అయి ఉండాలి అని కూడా ఆయన అన్నారు. సీఎం పర్యటన వ్యక్తిగత ఆకాంక్షల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని ఆయన విమర్శించారు.


