రియోడిజనీరో: గాజా వివాద పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న ‘శాంతి మండలి’లో పాలస్తీనాకు స్థానం కల్పించాలని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరారు. ఈమేరకు ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. తదుపరి చర్చల కోసం ఇరు దేశాల అధినేతలు వాషింగ్టన్లో కలవడానికి అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తమ 50 నిమిషాల ఫోన్ సంభాషణలో… ట్రంప్ ప్రతిపాదించిన ఈ మండలి పరిధిని గాజాకు పరిమితం చేయాలని, యూరోపియన్ యూనియన్ తరహాలో పాలస్తీనాకు ప్రాతినిధ్యం ఇవ్వాలని లూలా సూచించారు. ఈ మండలి పరిధిని ఇతర సంఘర్షణలకు విస్తరించాలనే ట్రంప్ ఆలోచనపై లూలా ఆందోళన వ్యక్తం చేశారు, ఇది ఐక్యరాజ్యసమితి (UN) పాత్రను తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు “భద్రతా మండలిలోని శాశ్వత సభ్యుల విస్తరణతో సహా ఐక్యరాజ్యసమితి సమగ్ర సంస్కరణ” చేపట్టాలని కూడా లూలా పిలుపునిచ్చారు. ఇది ప్రపంచ పాలన యొక్క భవిష్యత్తు గురించి విస్తృత ఆందోళనలను సూచిస్తుంది.
కాగా, బ్రెజిలియా – వాషింగ్టన్ మధ్య కొంతకాలం శత్రుత్వం తర్వాత అక్టోబర్లో జరిగిన మొదటి అధికారిక సమావేశమయ్యాక… లూలా – ట్రంప్ సన్నిహితంగా ఉన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈమేరకు బ్రెజిలియన్ ఎగుమతులను 40 శాతం సుంకాల నుండి ట్రంప్ ప్రభుత్వం మినహాయించింది.
నిన్న జరిగిన ఫోన్ సంభాషణల్లో ఇద్దరు నాయకులు వెనిజులా పరిస్థితిపై కూడా చర్చించారు, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా “ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం”ఉండాలని కోరారు. ఈ నెల ప్రారంభంలో అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవీచ్యుతుని చేయడానికి వెనిజులాపై అమెరికా దాడి సమర్థనీయం కాదని ఆయన అన్నారు.
కాగా, ఫిబ్రవరిలో భారతదేశం, దక్షిణ కొరియాకు పర్యటనల తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూలా వాషింగ్టన్ పర్యటన జరుగుతుందని, త్వరలో తేదీని నిర్ణయించనున్నామని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం తెలిపింది.


