ముంబయి: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. 2024 వరకు షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఈ ఏర్పాటు సజావుగా సాగింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలలో లభించిన భారీ విజయం మహాయుతికి మొదటి పెద్ద సవాలును విసిరింది. బీజేపీ భారీ మెజారిటీతో అతిపెద్ద పార్టీగా అవతరించింది, రాష్ట్రంలోని 288 స్థానాలకు గాను 132 స్థానాలను గెలుచుకుంది, సొంతంగా మెజారిటీకి కేవలం 13 స్థానాలు తక్కువగా ఉన్నాయి.
షిండే సేన 57 స్థానాలను, అజిత్ పవార్ ఎన్సిపి 41 స్థానాలను గెలుచుకోగా, శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గం కేవలం 20 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది, ఇది ప్రతిపక్ష కూటమిలో అత్యధికం. ఈ విజయం తన పాలన, తన హయాంలో ప్రవేశపెట్టిన పథకాల ఫలితమేనని వాదిస్తూ, షిండే ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు.
అయితే, బీజేపీ వెనక్కి తగ్గ లేదు. మరోవంక బీజేపీ-అజిత్ పవార్ పార్టీలకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉండటంతో షిండే మెత్తబడ్డారు. అసంతృప్తికి గురైన షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు.

కత్తులు దూయడం
ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి.వివిధ సమీకరణాలు వెలుగులోకి రావడం ప్రారంభించాయి, కొన్ని చోట్ల మహాయుతి పార్టీలు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది, ముంబై, పూణే, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో షిండే సేన, బీజేపీ కలిసి పోటీ చేయడం, పవార్ను ఒంటరిని చేయడం.
ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపునకు దారితీసింది. పవార్ కుటుంబంలో పునఃకలయిక గురించి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు ఎన్సిపికి కంచుకోటలుగా ఉన్న పూణే, పింప్రి-చింఛ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో రెండు పవార్ వర్గాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.
ఆ తర్వాత, ముఖ్యంగా అజిత్ పవార్ వైపు నుండి కత్తులు బయటకు వచ్చాయి. బీజేపీతో చేతులు కలపక ముందు తనపై ఆ పార్టీ పదే పదే చేసిన రూ. 70,000 కోట్ల నీటిపారుదల కుంభకోణం ఆరోపణలను ప్రస్తావిస్తూ, 2017 నుండి 2022 మధ్య కాషాయ పార్టీ అధికారంలో ఉన్న పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదేళ్లుగా అవినీతిలో కూరుకుపోయిందని, దానివల్ల అప్పులు పెరిగిపోయాయని పవార్ ఆరోపించారు.
“నాపై రూ. 70,000 కోట్ల నీటిపారుదల కుంభకోణం ఆరోపణలు వచ్చాయని అందరికీ తెలుసు. ఈ రోజు, ఆ ఆరోపణలు చేసిన వారితోనే నేను అధికారంలో ఉన్నాను. ఒక వ్యక్తి నేరం రుజువు కాకముందే అతన్ని దోషిగా ముద్ర వేయవచ్చా?” అని పవార్ ప్రశ్నించారు.
ఆ తర్వాత, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లో “దోపిడీ ముఠాలు” రాజ్యమేలుతున్నాయని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని ప్రస్తుత పాలకులకు “అధికార అహంకారం” ఉందని, కాంగ్రెస్,ఎన్సిపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అది లేదని పరోక్షంగా సూచించారు.
పవార్ ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ కోరగా, ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే “ఇబ్బందులు” తప్పవని హెచ్చరించింది. అయితే ఫడ్నవీస్ మరింత సూటిగా స్పందించారు. “కొంతమందికి ఎన్నికల గంట మోగినప్పుడే గొంతు వినిపిస్తుంది,” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలు స్నేహపూర్వక పోటీలకు అంగీకరించాయని, కానీ అజిత్ పవార్ సంయమనం “కొంత సడలింది” అని అన్నారు.
బీజేపీ పూణే, పింప్రి-చించ్వాడ్లో భారీ విజయం సాధించి, బీఎంసీలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది, కానీ సొంత మేయర్ను ఎన్నుకోవడానికి షిండే శివసేన మద్దతు అవసరం. ఇది మరో ఘర్షణకు దారితీసింది. ఇంకా పరిష్కారం కాలేదు.
ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం బారామతిలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఇది మహారాష్ట్రను ఒక దిగ్గజ నాయకుడిని కోల్పోయేలా చేయడమే కాకుండా, మహాకూటమికి ఒక కీలక వ్యక్తిని, షిండే ఆశయాలను నిలువరించడానికి ఉపయోగపడే ఒక నాయకుడిని బీజేపీ కోల్పోయేలా చేసింది.
అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్సిపి (శరద్ పవార్) వైపు వెళ్లకుండా చూసుకోవడం కూడా బీజేపీకి, ఫడ్నవీస్కు ఒక పెద్ద సవాలుగా మారింది. అలా జరిగితే అది ప్రతిపక్షాల బలాన్ని పెంచడమే కాకుండా, అధికార కూటమిలో షిండే స్థానాన్ని కూడా బలపరుస్తుంది. దీనిని నివారించడానికి ఒక మార్గం, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని పార్టీలోని మరొకరికి ఇవ్వడం. అయితే, స్పష్టమైన నంబర్ టూ లేని పక్షంలో ఇది కష్టం.
ఎన్సిపి అంశం
మహారాష్ట్ర చిక్కుముడి రాజకీయాలకు సంబంధించిన మరో పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు రెండు ఎన్సిపిలలో ఒకటి తన అధినేతను, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిని కోల్పోయిన తర్వాత దాని భవిష్యత్తు ఏమిటి? అజిత్ పవార్ వర్గం అసెంబ్లీ ఎన్నికలలో,మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన 85 ఏళ్ల మామ వర్గాన్ని అధిగమించి, తన పార్టీయే నిజమైన ఎన్సిపి అని నిరూపించుకుంది.
ఎన్సిపి పునరేకీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అజిత్ పవార్ మహారాష్ట్రలో ముందుండి నడిపిస్తారని, ప్రజా నాయకురాలిగా గుర్తింపు లేని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ఢిల్లీలో వ్యవహారాలను చూసుకుంటారని భావించారు.
అజిత్ పవార్ ఎన్సిపిలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో లోక్సభ ఎంపీ సునీల్ తట్కరే, రాజ్యసభ ఎంపీలు ప్రఫుల్ పటేల్, పవార్ భార్య సునేత్ర పవార్ ఉన్నారు, వీరు ఇప్పుడు ఆధిపత్యం కోసం పోటీపడవచ్చు. అజిత్ కుమారుడు పార్థ్ పవార్ కూడా ఉన్నారు, అతను 2019 లోక్సభ ఎన్నికలలో భారీ తేడాతో ఓడిపోయి, గత సంవత్సరం పూణేలో భూ కుంభకోణం ఆరోపణలలో చిక్కుకోవడంతో అతని రాజకీయ ప్రవేశం విఫలమైంది.
ఈ వర్గానికి ఉన్న ఏకైక మార్గం ఇద్దరు మాజీ మంత్రులకు బాధ్యతలు అప్పగించడం. వారికి ప్రజాదరణ ఉన్నప్పటికీ, విశ్లేషకుల దృష్టిలో ముందు వరుసలో లేరు: ధనంజయ్ ముండే, ఛగన్ భుజ్బల్. ఎన్సిపి వర్గాలు ఏకమైతే ఈ అంతర్గత పోరు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. శరద్ పవార్ సుప్రియా సూలేను పార్టీ ముఖచిత్రంగా నిలపడానికి ప్రయత్నించవచ్చు, ఇది సునేత్ర పవార్, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇతరులకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు, ఫలితంగా పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.


