హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఒక అపఖ్యాతిని మూటగట్టుకుంది. “దేశంలో కేటగిరీ-1 కింద ఉన్న మూడు అత్యంత ప్రమాదకర నిర్మాణాలలో” ఒకటిగా నిలిచింది.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం…కేటగిరీ-Iలోని ఇతర రెండు ఆనకట్టలు ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజురి డ్యామ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్కు చెందిన బొకారో బ్యారేజీ. వీటిని పునరుద్ధరణ, భద్రత పెంపుదల కోసం డ్యామ్ పునరావాసం, మెరుగుదల ప్రాజెక్ట్ ఫేజ్-II (DRIP-II) పథకం కింద చేర్చారు.
లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీ కేటగిరీ-I డ్యామ్ అయినందున, దాని నిర్మాణ పటిష్టతను కాపాడటానికి జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (NDSA) సిఫార్సు చేసిన వివిధ నివారణ, ఉపశమన చర్యలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, దెబ్బతిన్న మేడిగడ్డతో పాటు దాని అనుబంధ బ్యారేజీలైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఎన్డిఎస్ఎ సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించింది. అయితే, పనులను చేపట్టడానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఏజెన్సీ కోసం వెతుకుతున్నందున ప్రభుత్వం ఇంకా టెండర్లను ఖరారు చేయలేదు.
పార్లమెంట్లో డ్యామ్ల భద్రతపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రాజ్భూషన్ వివరాలు వెల్లడించారు. డ్యామ్ భద్రతా చట్టం-2021 నిబంధనల ప్రకారం… ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని ప్రతి నిర్దేశిత డ్యామ్కు ఏటా వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత తనిఖీ నిర్వహించడం తప్పనిసరి అని అన్నారు. మేడిగడ్డ అంశంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచించినట్లు తెలిపారు.
కాగా, 2025 వర్షాకాలానికి ముందు, తరువాత చేపట్టిన తనిఖీల తరువాత మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదం అంచున ఉన్న జాబితా కేటగిరి-1లో ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పరిరక్షణకు ఎన్డీఎస్ఏ పలు సూచనలు చేసింది. 2023 అక్టోబర్లో బ్యారేజీ పియర్స్ కుంగిపోయాయి. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పరీక్షలు చేసిన ఎన్డీఎస్ఏ బ్యారేజీ నిర్మాణాలు మరింత దెబ్బతినకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది.
దేశంలోని పాత డ్యాంల పరిరక్షణ చర్యలకు కేంద్రం చర్యలు చేపడుతుంది. గతేడాది వర్షాకాలానికి ముందు 6524, తరువాత 6553 డ్యాంలకు సంబంధించి పరిశీలన పూర్తి చేసి, రాష్ట్రాలు కేంద్రానికి నివేదికను ఇచ్చాయి. ఆ మేరకు మొత్తం డ్యాంలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి కేటగిరీలో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్న వాటి వివరాలు, రెండో కేటగిరీలో భారీ లోపాలున్నవి, మూడో కేటగిరీలో చిన్నచిన్న లోపాలు ఉన్నవి, వాటికి సంబంధించి తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యలను పేర్కొంది.
ఈమేరకు వీటిలో పారాపెట్ గోడలను పెంచడం, స్పిల్వేలను మెరుగుపరచడం, O&M మాన్యువల్స్, అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడం, గేట్లు, హైడ్రో-మెకానికల్ భాగాలను మరమ్మతు చేయడం లేదా మార్చడం, గ్రౌటింగ్, సీపేజ్ కంట్రోల్తో ఆనకట్ట నిర్మాణాలను బలోపేతం చేయడం, యాక్సెస్ రోడ్లు, లైటింగ్, క్యాట్వాక్లు వంటి భద్రతా సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆనకట్ట పునరావాసం, అభివృద్ధి ప్రాజెక్ట్ (DRIP – 2) కింద తెలంగాణకు రూ. 100 కోట్లు కేటాయించిందని మంత్రి ప్రస్తావించారు. అయితే, “ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిధులను ఖర్చు చేయలేదని తెలిపింది”.


