దుబాయ్: అమెరికా గనుక తమపై యుద్ధం ప్రారంభిస్తే… అది ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాదని, ఆ ప్రాంతమంతటికీ విస్తరించి అది పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఇరాన్ సర్వోన్నత నాయకుడు అమెరికాను హెచ్చరించారు. 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఇప్పటివరకు చేసిన హెచ్చరికలలో అత్యంత తీవ్రమైనవి కావడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వ్యాఖ్యలను ఆన్లైన్లో ప్రసారం చేసింది.
“మేము యుద్ధాన్ని ప్రేరేపించేవారము కాదు మరియు మేము ఏ దేశంపైనా దాడి చేయాలని కోరుకోవడం లేదు. కానీ ఇరాన్ దేశంపై దాడి చేసినా లేదా వేధించినా, వారికి ఇరాన్ ప్రజలు గట్టి దెబ్బ కొడతారని ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఖమేని అన్నారు.”
కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ “భారీ నౌకాదళం” ఇరాన్ వైపు వస్తోందని ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా సైనికులు ఇరాన్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే, అమెరికాకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఖమేనీ హెచ్చరించినట్లు రాయ్టర్స్ పేర్కొంది.
ఇరాన్ తనపై దాడి జరిగితే అమెరికన్ స్థావరాలు, నౌకలు, ఇజ్రాయెల్తో సహా ప్రాంతీయ మిత్రదేశాలపై తక్షణ క్షిపణి దాడులకు సిద్ధంగా ఉందని తెలిపింది. మొత్తంగా ఖమేనీ ప్రకారం… ఇరాన్ యుద్ధాన్ని ప్రేరేపించదు, కానీ ఆత్మరక్షణ కోసం బలంగా స్పందిస్తుందని తెలిపినట్టైంది.
మరోవంక ఖమేనీ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. వాషింగ్టన్తో ఇరాన్ చర్చలు విఫలమైతే ఖమేనీ చేసిన హెచ్చరిక ఎంతవరకు నిజమవుతుందో తేలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.


