ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఖేమ్చంద్ సింగ్ నిన్నప్రమాణ స్వీకారం చేశారు. 62 ఏండ్ల బీజేపీ శాసనసభ్యుడైన ఖేమ్చంద్ చేత గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పదవీ ప్రమాణం చేయించారు. కాగా, కుకీ వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసనసభ్యుడు ఎల్ డిఖో మణిపూర్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీకి చెందిన గోవిందాస్ కొంతౌజం, ఎన్పీపీకి చెందిన కె లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కిప్జెన్ న్యూఢిల్లీలోని మణిపూర్ భవన్ నుండి వర్చువల్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రద్దు చేసిన కొన్ని గంటల తర్వాత ఇక్కడి లోక్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అశాంతితో ఉన్న మణిపూర్లో గత ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు మరియు రాష్ట్రంలోని ఎన్డిఎ అగ్ర నాయకులు హాజరయ్యారు.
మెజారిటీ మెయిటీ వర్గం షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోరుతూ చేసిన డిమాండ్కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించిన తర్వాత, 2023 మే 3 నుండి మణిపూర్ హింసాత్మకంగా మారింది. అప్పటి నుండి, కుకీ,మెయిటీ వర్గాల సభ్యులతో పాటు భద్రతా సిబ్బందితో సహా కనీసం 260 మంది ఈ హింసలో మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
కాగా, మణిపూర్ బీజేపీ శాసనసభాపక్షం మంగళవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఖేమ్చంద్ సింగ్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఈ సమావేశానికి 37 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 35 మందితో పాటు, పార్టీ కేంద్ర పరిశీలకుడు తరుణ్ చుగ్, ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ. శారదా దేవి తదితరులు హాజరయ్యారు.
అనంతరం, జాతీయ రాజధానిలోని మణిపూర్ భవన్లో మరో సమావేశం జరిగింది, దీనికి మణిపూర్లోని ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల ఎమ్మెల్యేలు — నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి)కి చెందిన ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పిఎఫ్)కు చెందిన ఐదుగురు మరియు ముగ్గురు స్వతంత్రులు — మరియు బీజేపీ శాసనసభ్యులు హాజరయ్యారు.


