ఖాట్మండు: గత సంవత్సరం కె పి శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసిన జనరల్ జెడ్ నేతృత్వంలోని హింసాత్మక నిరసన తర్వాత తొలిసారిగా నేపాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి నేపాల్ ప్రజలు ఈరోజు ఉదయం పోలింగ్ బూత్లకు చేరుకోవడం ప్రారంభించారు.
ప్రత్యక్ష ఓటింగ్ జరిగే 165 స్థానాలకు మొత్తం 3,406 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా, మరో 110 స్థానాలకు దామాషా ఓటింగ్ ద్వారా 3,135 మంది అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. మొత్తం 275 మంది సభ్యుల ప్రతినిధుల సభను ఎన్నుకోవడానికి 18.9 మిలియన్లకు పైగా అర్హత కలిగిన నేపాలీలు తమ ఓటు హక్కును నేడు వినియోగించుకోనున్నారు.
ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తుంది. బ్యాలెట్ బాక్సులను సేకరించిన వెంటనే లెక్కింపు ప్రారంభమవుతుంది. 24 గంటల్లో ఫలితాలు వెల్లడవుతాయి.
ఈమేరకు తాత్కాలిక ఎన్నికల కమిషనర్ రామ్ ప్రసాద్ భండారి మాట్లాడుతూ… ఎన్నికలకు సంబంధించిన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని, ప్రజాస్వామ్య కసరత్తులో భాగంగా ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనాలని కోరారు.
కాగా, తాజా పరిస్థితుల్లో నేపాల్ రాజకీయాలు.. యథాతధ విధానాలను కొనసాగించాలనుకునే సంప్రదాయ పార్టీలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకునే పార్టీలనే రెండు వర్గాలుగా విడిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ప్రజలు సంప్రదాయ పార్టీలతో తీరుతో విసుగెత్తి పోయారని, మార్పును కోరుకుంటున్నారని చెబుతున్నారు.
ఆర్ఎస్పీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా కఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షాను ప్రకటించగా… నేపాలీ కాంగ్రెస్ గగన్ థాపాను బలపర్చింది. సీపీఎన్-యూఎంఎల్ మాత్రం 75 ఏళ్ల కేపీ శర్మ ఓలీనే మరోసారి ప్రధాని అభ్యర్థిగా ఎంచుకుంది.
