హైదరాబాద్: పట్టణ వినియోగదారులలో అధిక శాతం మంది రెస్టారెంట్లు, వీధి వ్యాపారుల వద్ద భోజనం కోసం అదనపు ధరలు చెల్లిస్తూ ఎల్పీజీ సంక్షోభం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
ఈ సర్వేకు భారతదేశంలోని 309 జిల్లాల నుండి స్పందనలు అందగా, వాటిలో టైర్ వన్ నగరాల నుండి 44 శాతం, టైర్ టూ నగరాల నుండి 27 శాతం, టైర్ త్రీ, ఫోర్, ఫైవ్ నగరాల నుండి 29 శాతం స్పందనలు వచ్చాయి.
గత వారంలో రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ధరలలో ఏమైనా పెరుగుదల గమనించారా అని సర్వేలో పాల్గొన్నవారిని అడగ్గా… ప్రతిస్పందించిన వారిలో 57 శాతం మంది (మొత్తం 19,328 మందిలో) 10 నుండి 50 శాతం మధ్య పెరుగుదలను గమనించినట్లు సమాధానమిచ్చారు. అయితే, గణనీయమైన సంఖ్యలో అంటే 43 శాతం మంది, తాము ఎలాంటి ధరల పెరుగుదలను గమనించలేదని సమాధానమిచ్చారు.
మరోవైపు, వీధి వ్యాపారుల వద్దకు వెళ్లిన వారిలో (19,322 మందిలో) 54 శాతం మంది ధరలు 25 శాతం వరకు పెరిగాయని తాము గమనించినట్లు సమాధానమివ్వగా, 33 శాతం మంది ఎలాంటి పెరుగుదలనూ గమనించలేదని చెప్పారు.
వంటకు పెరిగిన ఖర్చును భర్తీ చేసుకోవడానికి కొన్ని సంస్థలు “ఎల్పిజి రివిజన్ ఫీజు”గా అదనంగా రూ. 15 లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేయడం ప్రారంభించాయని, మరికొన్ని సంస్థలు ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే వంటకాలను మెనూ నుండి పూర్తిగా తొలగించాయని కూడా ఈ సర్వేలో పేర్కొన్నారు.
ఎల్పిజి సంక్షోభం
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడులు జరిపిన తర్వాత ఎల్పిజి సంక్షోభం తలెత్తింది. ఈ దాడులలో ఎక్కువగా గ్యాస్ క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఇంధన సంక్షోభం ఏర్పడింది.
మరోవంక ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతాన్ని నిర్వహించే ఈ ఇరుకైన పశ్చిమ ఆసియా జలమార్గం గుండా చమురు ట్యాంకర్లు ప్రయాణించకుండా నిరోధించింది.
చర్చల ద్వారా భారతదేశం కొన్ని ట్యాంకర్లకు మార్గాన్ని కల్పించుకోగలిగినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కుటుంబాలు సరుకులు నిల్వ చేసుకోవడానికి ఎగబాకాయి, కొందరు అదనంగా రెండు లేదా మూడు సిలిండర్లను కూడా కోరుకున్నారు.
ప్రభుత్వం ఇళ్లకు సరఫరాకే ప్రాధాన్యతనిచ్చినప్పటికీ, భోజనశాలలు తీవ్ర ఇబ్బందులకు గురై, మూసివేత అంచున నిలిచాయి. చాలా హోటళ్లు బ్లాక్ మార్కెట్ను ఆశ్రయించాయి లేదా కుటుంబాలకు ఉద్దేశించిన సరఫరాను దారి మళ్లించాయి.
హైదరాబాద్లో, రంజాన్ మాసంలో తీవ్రమైన రద్దీ సమయంలో తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి హోటల్, దుకాణ యజమానులు ఒక్కో సిలిండర్కు రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు చెల్లించవలసి వచ్చిందని సమాచారం.
కట్టెల పొయ్యిల వంటి ఇతర మార్గాలకు మారిన వారు, అధిక పొగ, దానిని శుభ్రం చేయడానికి అయ్యే విస్తృతమైన శ్రమ కారణంగా ఆ పద్ధతిని కొనసాగించలేకపోయారు.

