టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్లతో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ నౌకా రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేసుకునే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఆ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుండి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18.8 కోట్లు) వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ భారీ రుసుము ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, ఇది ఆ కీలక జలమార్గాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న కొత్త విధానానికి నిదర్శనమని, పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడైన ఇరాన్ చట్టసభ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్ది ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ (IRIB)కి తెలిపినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక పేర్కొంది.
బరూజెర్ది ప్రకారం…ఈ చర్యను దశాబ్దాల తర్వాత ఆ జలసంధిలో ఏర్పడిన కొత్త “సార్వభౌమాధికార విధానం”గా పేర్కొన్నారు. “జలసంధిని దాటే కొన్ని నౌకల నుండి రవాణా రుసుముగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఇరాన్ బలాన్ని ప్రతిబింబిస్తుందని” ఇరాన్ చట్టసభ సభ్యుడు బరూజెర్ది అన్నారు.
“ఇప్పుడు, యుద్ధానికి ఖర్చులు ఉంటాయి కాబట్టి, సహజంగానే మనం ఇది చేయాలి. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుండి రవాణా రుసుములను వసూలు చేయాలి,” అని ఆయన అన్నారు. ఈ చర్య ఇస్లామిక్ రిపబ్లిక్ “అధికారాన్ని” చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ హెచ్చరిక
48 గంటల్లోగా జలసంధిని తిరిగి తెరవకపోతే, ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకోవచ్చని గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో బౌరౌజెర్ది ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ జలసంధిని తెరవకపోతే, అమెరికా దాని “వివిధ విద్యుత్ ప్లాంట్లను, మొదటగా అతిపెద్ద దానితో ప్రారంభించి!” నాశనం చేస్తుందని ట్రంప్ అన్నారు.
ట్రంప్ హెచ్చరికను ప్రస్తావిస్తూ… ఇజ్రాయెల్ ఇంధన మౌలిక సదుపాయాలు ఇరాన్ చేతికి చిక్కి, “ఒక్క రోజులోనే” నాశనం చేయవచ్చని ఇరాన్ చట్టసభ సభ్యుడు కూడా పేర్కొన్నారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కూడా ట్రంప్కు బదులిస్తూ… టెహ్రాన్ విధానాన్ని వివరిస్తూ, ఇరాన్ శత్రువులు మినహా ఆ జలసంధి “అందరికీ తెరిచి ఉంది” అని అన్నారు.
“ప్రపంచ పటం నుండి ఇరాన్ను తుడిచివేయాలనుకోవడం ఒట్టి భ్రమ, ఇది వారి నిస్సహాయతకు నిదర్శనం. బెదిరింపులు, ఉగ్రవాదం మన ఐక్యతను మాత్రమే బలపరుస్తాయి. మా శత్రువులు మినహా హర్ముజ్ జలసంధి అందరికీ తెరిచి ఉంటుంది. యుద్ధభూమిలో బెదిరింపులను మేము దృఢంగా ఎదుర్కొంటాము,” అని ఆయన ఎక్స్లో రాశారు.
ఇరాన్ హెచ్చరిక
తమ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామన్న ట్రంప్ బెదిరింపును అమెరికా అమలు చేస్తే, చమురు,ఇతర ఎగుమతులకు కీలకమైన హర్ముజ్ జలసంధిని తక్షణమే “పూర్తిగా మూసివేస్తామని” ఇరాన్ పేర్కొంది.
పర్షియన్ గల్ఫ్ను ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కలిపే హర్ముజ్ జలసంధిని టెహ్రాన్ వాస్తవంగా మూసివేసింది. అదే సమయంలో, తమ శత్రు దేశాలు కాని ఇతర దేశాల నౌకలకు సురక్షిత మార్గం ఉందని కూడా అది వాదిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు దీని గుండానే వెళుతుంది, కానీ నౌకలపై దాడుల కారణంగా దాదాపు అన్ని ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయాయి.

