వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాలు తమ ఉనికిని విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇరాన్లోని “చమురును స్వాధీనం చేసుకోవడానికి” తాను “ప్రాధాన్యత ఇస్తానని”, కీలకమైన ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని వాషింగ్టన్ స్వాధీనం చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
“నిజం చెప్పాలంటే, ఇరాన్లోని చమురును తీసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం,” అని ఆయన ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. చమురు రంగాన్ని “నిరవధికంగా” నియంత్రించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకున్న వెనిజులా విధానంతో దీనిని పోల్చారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $116 దాటడంతో, నెల రోజుల్లో చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగిన తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“బహుశా మనం ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు,మనకు చాలా అవకాశాలు ఉన్నాయని” ట్రంప్ అన్నారు. అలాంటి చర్య “అంటే మనం అక్కడ కొంతకాలం ఉండాల్సి వస్తుంది” అని కూడా ఆయన జోడించారు. “వారికి ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందని నేను అనుకోవడం లేదు. మనం దానిని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చు,” అని ఆయన అన్నారు.
మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికి
భూతల యుద్ధం కోసం శిక్షణ పొందిన 10,000 మంది సైనికులను గల్ఫ్లో మోహరించాలని పెంటగాన్ ఆదేశించింది. వీరిలో సుమారు 2,200 మంది మెరైన్లతో సహా దాదాపు 3,500 మంది ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నారు, అదనపు బలగాలు మార్గంలో ఉన్నాయి.
అయితే ఖర్గ్ ద్వీపంపై దాడి అమెరికా దళాలకు ప్రమాదాన్ని పెంచుతుందని, సంఘర్షణను పొడిగించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఇటీవలి పరిణామాలలో సౌదీ వైమానిక స్థావరంపై జరిగిన దాడి ఒకటి. ఈ దాడిలో 12 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు,270 మిలియన్ డాలర్ల విలువైన నిఘా విమానం దెబ్బతింది. అలాగే, యెమెన్కు చెందిన హౌతీ దళాలు ఇజ్రాయెల్ వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించాయి.
ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, పాకిస్తానీ “దూతల” ద్వారా ఇరాన్తో పరోక్ష చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ అన్నారు. “ఒప్పందం చాలా త్వరగా కుదరవచ్చు,” అని ఆయన జోడించారు.
పాకిస్తాన్ జెండా ఉన్న 20 చమురు ట్యాంకర్లను హర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించిందని, “వారు మాకు 10 ఇచ్చారు. ఇప్పుడు 20 ఇస్తున్నారు” అని కూడా ఆయన అన్నారు.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్పై దాడి ప్రారంభించి, అప్పటి సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీతో సహా ఇప్పటివరకు 1,340 మందికి పైగా ప్రాణాలు తీసినప్పటి నుండి ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇరాన్ దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్, జోర్డాన్, ఇరాక్,అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రపంచ మార్కెట్లు, విమానయాన రంగానికి అంతరాయం కలిగింది.


