Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

సీఈసీపై విపక్షాల అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించిన పార్లమెంట్!

Share It:

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ విపక్ష సభ్యులు సమర్పించిన అభిశంసన తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ తిరస్కరించారు. 193 మంది ఎంపీలు సంతకాలు చేసిన ఈ తీర్మానాన్ని ఎటువంటి కారణాలు పేర్కొనకుండా తిరస్కరించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) “పార్లమెంట్‌ను అపహాస్యం చేస్తోందని” ఆరోపించాయి.

అయితే ఈ తీర్మాన నోటీసును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అందులో ఇమిడి ఉన్న అన్ని సంబంధిత అంశాలు సమస్యలను జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా అంచనా వేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. రాజ్యసభ ఛైర్మన్ లోక్‌సభ స్పీకర్ ఆ తీర్మాన నోటీసును స్వీకరించడానికి నిరాకరించారని రాజ్యసభ సచివాలయం లోక్‌సభ సచివాలయం వేర్వేరు ప్రకటనలలో దీని మీద వెల్లడించాయి.

పదవిలో ఉన్న సీఈసీపై మొట్టమొదటి తీర్మానం
పదవిలో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలో ఇదే మొదటిసారి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతృత్వంలో జారీ చేసిన ఈ నోటీసుపై 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. న్యాయమూర్తుల (విచారణ) చట్టం ప్రకారం ఉభయ సభలకు అవసరమైన 100, 50 సంతకాల పరిమితిని ఇది చాలా వరకు అధిగమించింది.

మార్చి 12న సమర్పించిన 10 పేజీల ఈ నోటీసులో సీఈసీపై మొత్తం ఏడు అభియోగాలు మోపారు. బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)ను కుమార్ నిర్వహించిన తీరుపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయన బీజేపీ పట్ల పక్షపాతం చూపారని ఆరోపించాయి.

ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) చట్టం, 2023 ప్రకారం… సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే, అదే కారణాలతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కూడా తొలగించవచ్చు. అభిశంసన నోటీసును స్వీకరించిన అనంతరం, ఆ మేరకు ఒక తీర్మానాన్ని పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో అంతిమంగా ఆమోదించాల్సి ఉంటుంది.

అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షం
అయితే, ఈ తిరస్కరణపై అధ్యక్షత వహించిన ఇద్దరు అధికారులలో ఎవరూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు, ఈ విషయం ప్రతిపక్షం నుంచి తక్షణమే తీవ్ర విమర్శలకు దారితీసింది.

సీఈసీపై దుష్ప్రవర్తనకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు, వాస్తవ ఉదాహరణలతో కూడిన వివరణాత్మక నోటీసును సమర్పించినప్పటికీ, ఎటువంటి కారణాలు చెప్పకుండా “సంక్షిప్త సమాధానం”తో తిరస్కరణ వచ్చిందని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ అన్నారు. “ఇందులో ఆశ్చర్యమేమీ లేదా?” అని ఆమె ప్రశ్నించారు.

టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ’బ్రియన్ మాట్లాడుతూ…”రాజ్యసభ ఎంపీలు సీఈసీని తొలగించాలంటూ ఇచ్చిన నోటీసును తిరస్కరించారు. కారణమా? ఏ కారణమూ చెప్పలేదు. బీజేపీ మన గొప్ప పార్లమెంటును అపహాస్యం చేస్తూనే ఉంది. సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.”

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేష్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, గత ఏడాది అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. “ప్రతిపక్ష ఎంపీలు ప్రవేశపెట్టిన పిటిషన్‌ను అంగీకరించిన గత రాజ్యసభ ఛైర్మన్‌కు ఏమైందో మనకు తెలుసు” అని ఆయన అన్నారు.

నెలల తరబడి సాగిన ప్రణాళిక
కాగా, సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌పై అభిశంసన తీర్మానం కొన్ని నెలలుగా రూపుదిద్దుకుంటూ వస్తోంది. గత ఆగస్టులో ఆయన విలేకరుల సమావేశంలో ఓట్ల దొంగతనం ఆరోపణలను ఖండించి, వాటిని “ప్రజలను తప్పుదోవ పట్టించే”, “రాజ్యాంగాన్ని అగౌరవపరిచే” ప్రయత్నాలుగా అభివర్ణించిన తర్వాత, ప్రతిపక్ష పార్టీలు తొలిసారిగా అభిశంసన తీర్మానంపై ఆలోచించాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “వోట్ చోరీ” ప్రచారం నేతృత్వంలో SIR ప్రక్రియపై పెరుగుతున్న నిరసనలతో ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది.

అయితే, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకోవడం కంటే ఎన్నికల పోటీలపై దృష్టి పెట్టాలని వాదిస్తూ, బీజేపీ నాయకులు ప్రతిపక్షాల ప్రయత్నాన్ని తోసిపుచ్చారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.