దుబాయ్: చమురు ఉత్పత్తిపై ఆంక్షలతో యూఏఈ సతమతమవడం, పొరుగున ఉన్న సౌదీ అరేబియాతో సంబంధాలు దెబ్బతినడంతో…ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్)నుంచి వైదొలగనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి.
యూఏఈ చాలాకాలంగా ఒపెక్లో సభ్యదేశంగా ఉంది. మొదట 1967లో అబుదాబి ఎమిరేట్ ద్వారా, ఆ తర్వాత 1971లో యూఏఈ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు సభ్యదేశంగా ఉంది.
కానీ, మధ్యప్రాచ్యంలో తన సొంత విదేశాంగ విధానాన్ని బలోపేతం చేయడానికి యూఏఈ ఎక్కువగా ప్రయత్నిస్తోంది. కాలక్రమేణా రియాద్ వైఖరికి ఇది విరుద్ధంగా ఉంది. ముఖ్యంగా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో సౌదీ అరేబియా…ఎమిరేట్స్ ను నేరుగా సవాలు చేయడం ప్రారంభించింది. కాగా,
యూఏఈ తన ప్రభుత్వ ఆధ్వర్యంలోని వామ్ (WAM) వార్తా సంస్థ ద్వారా ఈ ప్రకటన చేసింది.
టెహ్రాన్కు రష్యా మద్దతు
“ఈ నిర్ణయం యూఏఈ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక దృక్పథాన్ని, దేశీయ ఇంధన ఉత్పత్తిలో వేగవంతమైన పెట్టుబడులతో సహా అభివృద్ధి చెందుతున్న ఇంధన స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే, ప్రపంచ ఇంధన మార్కెట్లలో ముందుచూపుతో కూడిన పాత్ర పోషించాలనే దాని నిబద్ధతను ఇది బలపరుస్తుందని” యూఏఈ పేర్కొంది.
“ఒపెక్ నుండి నిష్క్రమణ తరువాత, యూఏఈ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే ఉంటుంది. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, అదనపు ఉత్పత్తిని క్రమంగా,నియంత్రిత పద్ధతిలో మార్కెట్లోకి తీసుకువస్తుందని” ఆ దేశం పేర్కొంది.
వియన్నా కేంద్రంగా పనిచేసే చమురు కూటమి అయిన ఒపెక్ (OPEC)లో సౌదీ అరేబియా చాలాకాలంగా ఒక శక్తివంతమైన దేశంగా ఉంటోంది. ఇటీవలి సంవత్సరాలలో యునైటెడ్ స్టేట్స్ ముడి చమురు ఉత్పత్తిని పెంచడంతో, ఒపెక్ మార్కెట్ శక్తి కొంత క్షీణించింది.
సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఆర్థిక సమస్యలు, ప్రాంతీయ రాజకీయాల విషయంలో, ముఖ్యంగా ఎర్ర సముద్ర ప్రాంతంలో, పోటీ పెరుగుతూ వస్తోంది.
2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ రెండు దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా డిసెంబర్ చివరిలో బాంబు దాడి చేయడంతో, ఆ కూటమి పరస్పర నిందలతో విచ్ఛిన్నమైంది.
యూఏఈ ఆర్థిక కేంద్రమైన దుబాయ్లో చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సౌదీ ప్రసార సంస్థలు, ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవలి నెలల్లో తమ దేశానకి తిరిగి వచ్చేశాయి.

