హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమని, రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయమని ఆయన మెచ్చుకున్నారు.
బుధవారం ఢిల్లీలో మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలను చూసి మిగతా రాష్ట్రాలు పరస్పరం నేర్చుకోవాలని ఆయన ఉద్భోదించారు.
మెరుగైన పాలన అందించాలంటే రాజకీయాలను పక్కన పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. కంటి వెలుగు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోని పేదలకు ఉపయోగపడుతుందని, అందుకే ఢిల్లీతో పాటు పంజాబ్లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
కాగా, తాను ప్రతిపాదించిన ‘ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్'(G8)పై కేజ్రీవాల్ విలేకరులతో స్పందించారు. పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ లేఖలు పంపారు. ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలను సందర్శించి ఒకరినొకరు నేర్చుకునేందుకు ఈ వేదిక ఏర్పాటైంది. ఇది పాలనా వేదిక, 2024 లోక్సభ ఎన్నికల కోసం పొత్తు కోసం కాదని కేజ్రీవాల్ తెలిపారు