పాట్నా: ఢిల్లీ, గుజరాత్, హర్యానా తర్వాత బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ‘మోదీ హఠావో దేశ్ బచావో’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇక్కడి చారిత్రాత్మక గాంధీ మైదాన్లోని గేట్ నంబర్ 10 వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. అయితే, ఈ చర్య వెనుక ఎవరున్నారో పాట్నా జిల్లా అధికారులకు తెలియడం లేదు.
గాంధీ మైదాన్ గోడపై గురువారం రాత్రి అలాంటి పోస్టర్ను అతికించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానిక వీధి వ్యాపారులు రాత్రి 11 గంటల వరకు ఆ స్థలంలోనే ఉన్నారని పేర్కొన్నారు. అప్పటివరకు అక్కడ పోస్టర్లు లేవని, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య పోస్టర్లు వేసినట్లు భావిస్తున్నారు.
ఢిల్లీ, గుజరాత్, హర్యానా పోలీసులు ఇప్పటికే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నారు. అయితే పాట్నా విషయంలో ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పాట్నా పోలీసులు సిసిటివి ఫుటేజీని స్కాన్ చేసి బాధ్యుల గురించి కొన్ని ఆధారాలను కనుగొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మరోవంక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై దేశవ్యాప్తంగా తమ పోరాటాన్ని కొనసాగించడానికి వీలుగా మొత్తం 11 భాషల్లో ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ పోస్టర్లను ముద్రించింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో ఈ ‘మోదీ హఠావో.. దేశ్ బచావో (Modi Hatao Desh Bachao)’ పోస్టర్లను ఆప్ రూపొందించింది.
మార్చి 23న ఢిల్లీలోని జంతర మంతర్ లో ఆప్ (AAP) భారీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో ఆప్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్(ఢిల్లీ), భగవంత్ మన్(పంజాబ్) పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ‘మోదీ హఠావో.. దేశ్ బచావో (Modi Hatao Desh Bachao)’ పోస్టర్లను మార్చి 30న అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అతికిస్తామని ఇదే సభలో ఆప్ నేత గోపాల్ రాయ్ ప్రకటించారు.