బీజింగ్: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం బీజింగ్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల అధికార పర్యటన నిమిత్తం ఆయన నిన్న చైనాకు చేరుకున్నారు. కాగా, అమెరికా అధ్యక్షులు చైనాలో పర్యటించడం సుమారు తొమ్మిదేళ్ల తరువాత ఇదే మొదటిసారి. అధ్యక్ష హోదాలో చైనాలో పర్యటించడం ట్రంప్కు ఇది రెండోసారి. ఈ పర్యటనలో ట్రంప్ … జిన్ పింగ్ తో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ శాంతి, అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.
గత ఏడాది చైనాను అమెరికాకు ప్రధాన శత్రువుగా చిత్రీకరించిన ట్రంప్, చైనా ఉత్పత్తులపై ఏకంగా 245 శాతం టారిఫ్స్ (సుంకాలు) విధించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, చైనా చేరుకున్న తర్వాత ట్రంప్…జిన్పింగ్ను పొగిడారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒక గొప్ప నాయకుడని కొనియాడారు. “నేను ఈ మాట అనడం చాలా మందికి, ముఖ్యంగా నా విమర్శకులకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ నిజం చెప్పక తప్పదు, ఆయన చైనాను ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో చైనాను అమెరికాకు ప్రధాన శత్రువుగా చిత్రీకరించిన ట్రంప్, ఇప్పుడు ఆ దేశాధినేతను పొగడ్తలతో ముంచెత్తడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్ విషయంలో చైనా సహకారం కోరడం ద్వారా మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పవచ్చని, తద్వారా అమెరికా ప్రయోజనాలను కాపాడవచ్చని ట్రంప్ భావిస్తున్నారు.
చైనా పర్యటనకు ట్రంప్తో పాటు, టెక్నాలజీ, ఫైనాన్స్, ఇంధన రంగాలకు చెందిన ఎలాన్ మస్క్, జెన్సన్ హువాంగ్, టిమ్ కుక్, లారీ ఫింక్ వంటి ఇతర ప్రముఖ అమెరికన్ ఎగ్జిక్యూటివ్లతో కూడిన అత్యంత ప్రభావవంతమైన వ్యాపార ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. ఈ పరిణామం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను ఇప్పటికీ కలిపి ఉంచుతున్న ఆర్థిక బలాన్ని నొక్కి చెబుతోంది.
ఇదిలా ఉండగా…ట్రంప్ పర్యటనను, అంతకంతకూ అస్థిరంగా మారుతున్న సంబంధాన్ని మార్చే ప్రయత్నంగా కాకుండా, స్థిరీకరించే ప్రయత్నంగా బీజింగ్ అభివర్ణించింది. ఈ విస్తృత వ్యూహాత్మక ప్రాముఖ్యత చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ వ్యాఖ్యలలో ప్రతిబింబించింది. “సమానత్వం, గౌరవం, పరస్పర ప్రయోజనం” అనే స్ఫూర్తితో సహకారాన్ని విస్తరించడానికి బీజింగ్ సుముఖతను పునరుద్ఘాటిస్తూ, ఇద్దరు నాయకులు “చైనా-అమెరికా సంబంధాలు, ప్రపంచ శాంతి, అభివృద్ధికి సంబంధించిన ప్రధాన సమస్యలపై లోతైన అభిప్రాయాలను పంచుకుంటారని” ఆయన అన్నారు.
ఈమేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో జియాన్ మాట్లాడుతూ…”మహాశక్తుల ఘర్షణకు ఒక ముందంజగా” నిలవాల్సిన ప్రాంతీయ దేశాలపై ఒత్తిడిని తగ్గించడంలో ట్రంప్ పర్యటన సహాయపడుతుందని, అంతేకాదు “ఆసియా ఆసియావాసులదే” అనే ప్రాంతీయ వాతావరణాన్ని బలోపేతం చేస్తుందని, ఆసియా దేశాలు తమ సొంత అభివృద్ధి ప్రాధాన్యతలను రూపొందించుకోవడంలో మరింత స్వేచ్ఛను వినియోగించుకోగలవని అన్నారు.

