బీజింగ్: ఇరాన్కు తాను ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని, భవిష్యత్తులోనూ ఇవ్వబోమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికాకు హామీ ఇచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మధ్యప్రాచ్య సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అలాగే హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు చైనా మద్దతు తెలిపినట్లు అగ్రరాజ్యాధినేత పేర్కొన్నారు.
బీజింగ్ ఆ ప్రాంతం నుండి పెద్ద మొత్తంలో చమురును కొనుగోలు చేస్తున్నందున, హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలని చైనా కోరుకుంటోందని కూడా జిన్పింగ్ తనకు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు.
“చైనా అధ్యక్షుడు ఒక ఒప్పందం కుదరాలని కోరుకుంటున్నారు. ‘నేను ఏ విధంగానైనా సహాయపడగలిగితే, సహాయం చేయాలనుకుంటున్నాను’ అని ట్రంప్ అన్నారు. అంత చమురును కొనుగోలు చేసే ఎవరికైనా స్పష్టంగా ఏదో ఒక రకమైన సంబంధం ఉంటుంది, కానీ ఆయన హర్ముజ్ జలసంధిని తెరవాలని కోరుకుంటున్నారు,” అని ఆయన జోడించారు.
ట్రంప్ వాదనలపై చైనా అధికారులు స్పందించలేదు
కాగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన చర్చల నివేదికలో ఇరాన్ లేదా హర్ముజ్ జలసంధి గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. మధ్యప్రాచ్య పరిస్థితి, ఉక్రెయిన్ సంక్షోభం,కొరియా ద్వీపకల్పం వంటి ప్రధాన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై” ఇద్దరు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని ఆ ప్రకటన పేర్కొంది.

