Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

తెలంగాణలో జూన్ 25 నుండి ఎస్‌ఐఆర్‌!

Share It:

న్యూఢిల్లీ: తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో, బూత్ స్థాయి అధికారులు (BLOs) జూన్ 25 నుండి జూలై 24 మధ్య ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే (H2H enumeration) చేపడతారు. ఓటర్లు తమ పేర్లను, తమ తండ్రులు, తాతల పేర్లను గత SIR (2002) ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని ఈసీ కోరింది. ECI తెలిపిన వివరాల ప్రకారం, సన్నాహక పనులు/శిక్షణ/ముద్రణ కార్యకలాపాలు నేటినుండి జూన్ 24 మధ్య జరుగుతాయి. BLOల ఇంటింటి సర్వేలు జూన్ 25 నుండి జూలై 24 మధ్య కొనసాగుతాయి. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/పునఃవ్యవస్థీకరణ పనులు జూలై 24 నాటికి పూర్తి చేస్తారు.

ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ జూలై 31న జరుగుతుంది. అభ్యంతరాలు, విజ్ఞప్తులను దాఖలు చేయడానికి గడువు జూలై 31 నుండి ఆగస్టు 30 మధ్య ఉంటుంది. నోటీసుల జారీ, విచారణ, ధృవీకరణ; సర్వే ఫారాలపై నిర్ణయం తీసుకోవడం; అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలన్నీ ఎన్నికల నమోదు అధికారుల (EROs) ఆధ్వర్యంలో ఏకకాలంలో జరుగుతాయి. తుది ఓటర్ల జాబితాల ప్రచురణ అక్టోబర్ 1, 2026న జరుగుతుంది. BLOలు ప్రతి ఇంటికీ వెళ్లి, ఇప్పటికే ఉన్న ఓటర్లందరికీ పాక్షికంగా వివరాలు నింపిన సర్వే ఫారాలను (Enumeration Forms) రెండు ప్రతులలో అందజేస్తారు; ఆ ఫారాలను ఎలా నింపాలో వారికి తగిన సూచనలు ఇస్తారు. ఏదైనా ఇల్లు తాళం వేసి గానీ, మూసివేసి గానీ ఉన్నట్లు BLO గమనిస్తే, వారు కనీసం మూడు సార్లు ఆ ఇంటిని సందర్శించాల్సి ఉంటుంది.

కాగా, ఓటర్లు తమ సర్వే ఫారాలను ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అలాగే నింపిన ఫారాలను ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. BLOల పర్యటన తేదీలను ఎన్నికల నమోదు అధికారులు ముందుగానే తెలియజేస్తారు, అలాగే ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. BLOలు నింపిన ఫారాలను సేకరించి, ఆ సర్వే ఫారం ప్రతిపై రసీదు (acknowledgement) ముద్రించి ఓటరుకు అందజేస్తారు; ఆ ప్రతిని ఓటరు తన వద్ద భద్రపరుచుకోవచ్చు.

ఇదిలా ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఓటరు సవరణ ప్రక్రియలో భారీగా ఓట్లు తొలగిపోవడం, అర్హులైన వారి పేర్లు సైతం జాబితా నుంచి గల్లంతు కావడం వంటి పరిణామాలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకుకు గండి పడుతుందేమోనన్న ఆందోళనలో ఉన్న పార్టీలు, ఈసారి క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.