న్యూఢిల్లీ: నార్వే పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని సూటిగా ప్రశ్నించి వార్తల్లో నిలిచిన ఓస్లోకు చెందిన జర్నలిస్ట్ హెలె లింగ్, తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మెటా నిలిపివేసింది.
Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg
— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026
ఈమేరకు నిన్న ఆమె X లో పెట్టిన ఒక పోస్ట్లో, రోజంతా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి ఇబ్బంది పడ్డానని, చివరికి అది నిలిపివేసారని లింగ్ వెల్లడించారు. తన ఫేస్బుక్ ఖాతా కూడా నిలిపివేసినట్లు ఆమె ధృవీకరించారు. “మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో సంప్రదించడానికి ప్రయత్నిస్తుంటే, నా రెండు ఖాతాలను నిలిపివేశారని మీకు తెలియజేయాలనుకుంటున్నానని ఆమె మెటాను ట్యాగ్ చేస్తూ రాశారు.
ఈ నిలిపివేతను “పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యం”గా లింగ్ అభివర్ణించారు, ఇలాంటి అనుభవం తనకు ఇదే మొదటిదని పేర్కొన్నారు. టూ-స్టెప్ వెరిఫికేషన్ను దుర్వినియోగం చేయడం వల్ల ఇది జరిగిందా లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అనే దానిపై ఆమె అనిశ్చితిని వ్యక్తం చేశారు, ఒకవేళ ఖాతాలు పునరుద్ధరిస్తే వాటిని ఎలా సురక్షితం చేసుకోవాలో సలహా కోరారు. ఆంక్షల కారణంగా చాలా మంది భారతీయుల సందేశాలకు వెంటనే స్పందించలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు.
ప్రధాని మోదీ తన యూరప్ పర్యటనలో భాగంగా ఓస్లోలో ఆగినప్పుడు, భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఆయనను నిలదీయడంతో ఈ జర్నలిస్ట్ విశేష ప్రచారం పొందారు. ప్రధానమంత్రి దేశీయంగా గానీ, విదేశాలలో గానీ ఎందుకు పత్రికా సమావేశాలు నిర్వహించడం లేదని ఆమె గతంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు.
మరో వీడియోలో, 12 ఏళ్లుగా మోదీ పత్రికా సమావేశం నిర్వహించనప్పుడు నార్వే భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ఎందుకు అభివర్ణిస్తోందని నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్ను లింగ్ ప్రశ్నించారు. పత్రికా సంస్కృతిలో తేడాలు ఉన్నాయని అంగీకరిస్తూనే, దేశంలోని అధిక జనాభాను ఉదహరిస్తూ…నార్వే ప్రధాని స్టోర్ భారతదేశ ఎన్నికలను ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం 157వ స్థానంలో ఉండగా, నార్వే అగ్రస్థానంలో ఉందని పేర్కొంటూ లింగ్ తన చర్యలను సమర్థించుకున్నారు.
నార్వేలోని భారత రాయబార కార్యాలయం దీనిపై నేరుగా స్పందిస్తూ, మోదీ పర్యటన సందర్భంగా రాడిసన్ హోటల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశామని, లింగ్ అక్కడికి వచ్చి తన ప్రశ్నలు అడగవచ్చని పేర్కొంది.
