హైదరాబాద్: ఇస్లామోఫోబియా చివరికి తెలంగాణను కూడా తాకింది. హైదరాబాద్లోని వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ సిబ్బంది…ఆ పార్క్లో విహరించడానికి వెళ్లిన కొంతమంది ముస్లిం యువకులను మతం పేరుతో విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు జూలై 1న, తన స్నేహితులతో కలిసి పార్కుకు వెళ్లిన వారిలో ఒకరైన అనస్ మీర్జా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు.
వారు అక్కడున్న ఒక మరగుజ్జు వద్దకు వెళ్లి ఫోటో అడిగారు. అతను నిరాకరించి, తాను కేవలం పిల్లలతో మాత్రమే ఫోటోలు దిగుతానని చెబుతూ మరో సిబ్బంది వైపు చూపించాడు. ఆ యువకులు ఏమీ అనకుండా అవతలి వ్యక్తి వద్దకు వెళ్లారు.
“మార్డాలో ముసల్మానో కో (ముస్లింలందరినీ చంపేయండి),” అని ఆ మరగుజ్జు అనడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయమై అనస్, అతని స్నేహితులు ఆ మరగుజ్జును నిలదీసారు. వారు యాజమాన్యం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. వండర్లా యాజమాన్యం ఈ పరిస్థితిని నిర్వహించిన తీరు పట్ల తాను నిరాశ చెందానని అనస్ మీడియాకు తెలిపారు.
“మేము మా ఫోన్లలో దుర్భాషను రికార్డ్ చేశామని వారికి చెప్పాము, కానీ వారు ఆ వ్యక్తిపై తగిన చర్య తీసుకోలేదు,” అని అతను అన్నాడు. కాగా,
అనస్ ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేయగా, అతనికి చాలా మంది నెటిజన్లు సానుభూతి చూపారు. ఈ పరిస్థితిపై వండర్లా యాజమాన్యం నిర్లక్ష్యం చూపడాన్ని ఖండిస్తూ, పార్క్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ట్యాగ్ చేశారు. కొంతమంది హైదరాబాద్ వాసులు వండర్లాను బహిష్కరించాలని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్లో ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని ఒక నెటిజన్ మీడియాతో చెప్పాడు. “నా నగరంలో ఇలాంటిది ఎదురవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నిజంగా విచారకరమని అతను వాపోయాడు.”
