న్యూఢిల్లీ: అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై ఐక్యరాజ్యసమితికి చెందిన ముగ్గురు స్వతంత్ర మానవ హక్కుల నిపుణులు తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాల నుంచి లక్షలాది మంది ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించడంపై వారు భారత ప్రభుత్వానికి తక్షణ హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రక్రియ అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తూ, ముస్లింలు, ఇతర మైనారిటీలను అసమానంగా లక్ష్యంగా చేసుకుందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మైనారిటీ సమస్యలు, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత విశ్వాస స్వేచ్ఛపై ఐరాస ప్రత్యేక ప్రతినిధులు భారత ప్రభుత్వానికి పంపిన ఒక అధికారిక లేఖలో, ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ద్వారా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సుమారు 5.20 కోట్ల పేర్లను తొలగించినట్లు తెలిపారు.
ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు – నికోలస్ లెవ్రాట్, ఐరీన్ ఖాన్, నజిలా ఘనియా – SIR ప్రక్రియ సందర్భంలో రాజకీయ నాయకులు, సీనియర్ ప్రజా ప్రముఖులు వెలిబుచ్చిన వివక్షాపూరిత వ్యాఖ్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణుల ప్రకారం, ఏప్రిల్ 23- 29 తేదీలలో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల విషయంలో పశ్చిమ బెంగాల్లో ఈ పరిస్థితి ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తోంది.
మే 1, 2026న రాసిన ఈ నివేదిక, నిపుణులు లేవనెత్తిన ఆందోళనలకు స్పందించడానికి భారత ప్రభుత్వానికి 60 రోజుల కాలపరిమితిని ఇచ్చింది. అస్సాంలో జాతీయ పౌర పట్టిక (NRC) సంకలనం, నవీకరణ జరుగుతున్నప్పుడు, డిసెంబర్ 2018లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధులు ఇలాంటి సమాచారాన్నే పంపారు. ఆ సమయంలో, వివాదాస్పదమైన NRC నుండి జాతి, మత, భాషా మైనారిటీలను మినహాయించడంలో ఎన్నికల సంఘం పాత్రను కూడా అధికారులు ప్రశ్నించారు.
తాజా సమాచారం SIR తో ఉన్న అనేక సమస్యలను ఎత్తిచూపుతోంది. వాటిలో, అస్పష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థల వాడకం, స్పెల్లింగ్ వంటి బలహీనమైన కారణాలతో పేర్లను తొలగించడం, ఓటర్లు తమ పత్రాలను సరిచేసుకోవడానికి తగినంత సమయం లేకపోవడం, నివారణ చర్యలు లేకపోవడం, మైనారిటీలను మినహాయించడమే లక్ష్యంగా ఉన్న రాజకీయ కథనం వంటివి ఉన్నాయి.
అంతేకాదు “కేంద్ర హోం మంత్రితో సహా ఉన్నత ప్రభుత్వ అధికారులు, ఓటర్ల పేర్ల తొలగింపును అక్రమ బంగ్లాదేశీ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నట్లుగా బహిరంగంగా చిత్రీకరించారని సమాచారం. ఈ వాదన చట్టబద్ధమైన భారతీయ ముస్లిం పౌరులను విదేశీయులతో సమానంగా చూస్తుంది.”
పశ్చిమ బెంగాల్లో SIR ప్రభావాన్ని ఈ నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది. ముఖ్యంగా నందిగ్రామ్ నియోజకవర్గంపై దాని ప్రభావాన్ని గమనించింది. “SIR ప్రక్రియ వల్ల ముస్లిం ఓటర్లు అసమానంగా ప్రభావితమయ్యారని సమాచారం. నందిగ్రామ్ నియోజకవర్గంలో, తొలగించిన ఓటర్లలో 95% మంది ముస్లింలేనని ఆరోపణలు ఉన్నాయి.
లక్షిత తొలగింపులను “అనేక మానవ హక్కుల బాధ్యతల తీవ్ర ఉల్లంఘనలు”గా పేర్కొన్నారు. జాతీయ లేదా జాతి, మత, భాషా మైనారిటీలకు చెందిన వ్యక్తుల హక్కులపై 1992 ప్రకటన, పౌర, రాజకీయ హక్కులపై 1979 అంతర్జాతీయ ఒడంబడికతో సహా పలు ఒప్పందాలపై భారతదేశం సంతకం చేసింది.
బీహార్లోని ఈ పరిపాలనా చర్య, ముఖ్యంగా ముస్లింలు, ఇతర మైనారిటీల విషయంలో, పెద్ద ఎత్తున ఓటు హక్కును కోల్పోవడం, పౌరసత్వాన్ని రద్దు చేసే అవకాశంపై కూడా ఆందోళన కలిగించిందని నివేదికలు తెలిపాయి. “SIR ప్రక్రియను నిర్వహించిన తీరు పట్ల మేము ప్రత్యేకంగా ఆందోళన చెందుతున్నాము, ఇది అధిక సంఖ్యలో ముస్లింలు, బెంగాలీ సంతతికి చెందిన వ్యక్తులు, అలాగే ఇతర మైనారిటీలను ప్రభావితం చేసే అవకాశం ఉంది,” అని నివేదిక పేర్కొంది.
వివక్ష లేకపోవడం, ఓటు హక్కుపై ICCPR నిబంధనలు, అలాగే మైనారిటీ హక్కులపై నిబంధనను ఉల్లంఘించే అవకాశం ఉందని ఆ లేఖ పేర్కొంది. ఇది భారత ప్రభుత్వానికి ఏడు ప్రశ్నలను సంధించింది. వాటిలో, బహిష్కరణకు గురైన ఓటర్ల మతం, జాతి, అప్పీళ్ల ప్రక్రియ వివరాలు, అన్యాయంగా తొలగించిన వారికి అందుబాటులో ఉన్న పరిహారాల గురించిన సమాచారం అందించాలని కోరింది.
ఐక్యరాజ్యసమితి విధానం ప్రకారం, ఈ సమాచారం మరియు భారత ప్రభుత్వ ప్రతిస్పందన, పంపిన 60 రోజుల తర్వాత లేదా ఆ గడువులోగా భారతదేశం స్పందిస్తే అంతకంటే ముందే, ప్రత్యేక విధానాల సమాచార నివేదన వెబ్సైట్లో బహిరంగపరచబడతాయి.
ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ సమయంలో సుమారు 5.20 కోట్ల పేర్లు తొలగించారని తమకు అందిన సమాచారం ఆరోపిస్తోందని ఐక్యరాజ్యసమితి నిపుణులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలలో ఒకటి, ఇక్కడ సుమారు 91 లక్షల పేర్లు తొలగించినట్లు సమాచారం.
ప్రభావిత వ్యక్తులలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు ఉన్న భారత జాతీయులు కూడా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. “పరిపాలనాపరమైన సవాళ్ల కారణంగా భారతదేశం అంతటా సర్వసాధారణంగా కనిపించే పత్రాలలోని చిన్న అక్షర దోషాలను, ఓటర్ల పేర్లను తొలగించడానికి ఒక సాకుగా వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయని ఆ లేఖ తెలిపింది. అంతేకాదు చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ తమను ఓటర్ల జాబితా నుండి తొలగించారని బాధితుల్లో చాలామంది ఆరోపించగా, ముస్లిం ఓటర్లు అసమానంగా ప్రభావితమయ్యారని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఓటర్ల సవరణకు సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి ప్రజా ప్రముఖులు చేస్తున్న వివక్షాపూరిత వ్యాఖ్యలను కూడా ఆ సమాచారం విమర్శించింది.
ఈ చర్యలో భాగంగా, “అక్రమ బంగ్లాదేశీ వలసదారులు” అని పేర్కొంటూ చేసిన బహిరంగ ప్రకటనలను, “గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి” అనే పదబంధాన్ని ఉటంకిస్తూ, ఇటువంటి భాష ముస్లిం పౌరులను, ఇతర మైనారిటీ వర్గాల సభ్యులను అపఖ్యాతిపాలు చేయగలదని ఆ లేఖ పేర్కొంది.
కాగా, ఈ సమాచారంపై వ్యాఖ్యానించమని కోరినప్పటికీ, ఎన్నికల సంఘం, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు.

