హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 1,264 ఎకరాల వక్ఫ్ భూమిని స్వాధీనం చేసుకుని, దానిని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC)కు బదిలీ చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ స్వాధీన ప్రక్రియలో భాగంగా, ఇప్పటికే ‘జామియా నిజామియా’కు చెందిన 510 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని TGIICకి బదిలీ చేశారు. ఇప్పుడు, చేవెళ్ల మండలంలోని ఆలూరులో ఉన్న ‘హజ్రత్ మఖ్దూమ్ షా బియబాని దర్గా’కు చెందిన భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరుగుతోంది.
‘భూసేకరణలో సరైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం-2013’ (Right to Fair Compensation and Transparency in Land Acquisition Act, 2013) ప్రకారం ప్రభుత్వం ఈ స్వాధీనానికి సంబంధించిన నోటీసును జారీ చేసింది.
‘సరైన పరిహారం హక్కు చట్టం’ అంటే ఏమిటి?
భూసేకరణ చట్టం ప్రకారం…ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరించినప్పుడు, భూ యజమానులకు, ప్రభావిత కుటుంబాలకు సరైన పరిహారం, పారదర్శకమైన సేకరణ ప్రక్రియలు, తప్పనిసరి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది.
ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు రెండు రెట్ల వరకు పరిహారం చెల్లించేలా హామీ ఇస్తుంది. అలాగే, జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు గృహవసతి, ఉపాధి, ఆర్థిక సహాయంతో సహా పునఃస్థాపన, పునరావాస చర్యలను ఇది తప్పనిసరి చేస్తుంది.
మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శికి లేఖ
ఆ భూమిని TGIICకి బదిలీ చేయాలని ఆదేశిస్తూ తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీఉల్లాకు ప్రభుత్వం లేఖ జారీ చేసింది. ఈ భూమిని నామమాత్రపు పరిహారంతో స్వాధీనం చేసుకుంటారని మైనారిటీ సంక్షేమ బోర్డుకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
భూసేకరణ వివరాలు
భూసేకరణ ప్రణాళికలో భాగంగా, ప్రభుత్వం సుమారుగా ఆలూరు-1లో 510 ఎకరాలు, ఆలూరు-2లో 380 ఎకరాల 38 గుంటలు, ఆలూరు-3లో 357 ఎకరాల 16 గుంటల భూమిని సేకరించనుంది. కాగా, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం మొత్తం 1,248 ఎకరాల 22 గుంటల వక్ఫ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.


