Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ప్రధాని మోదీ యువత వ్యతిరేకి…సీజేపీ నిరసనకారులపై హింసపై రాహుల్ గాంధీ!

Share It:

న్యూఢిల్లీ: భారత దేశ చ‌రిత్ర‌లోనే యువ‌త‌ను అత్యధికంగా వ్య‌తిరేకించే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీయేనని కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం దేశ యువతను విఫలం చేయడమే కాకుండా, బలప్రయోగం ద్వారా వారిని చురుకుగా అణచివేస్తోందని ఆరోపించారు.

పోటీ పరీక్షలలో పదేపదే జరుగుతున్న పేపర్ లీక్‌లకు నిరసనగా విద్యార్థులతో సహా వేలాది మంది కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు భారీ నిరసన చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్షాకాల సమావేశాల మొదటి రోజున నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పార్లమెంట్ స్ట్రీట్‌ సమీపంలో వారిని చెదరగొట్టడానికి భద్రతా దళాలు లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగించాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

“152 పేపర్ లీకులు. 7.5 కోట్ల మంది విద్యార్థులు బాధితులయ్యారు. ఒక్క దోషికి కూడా శిక్ష పడలేదు.” లీక్‌లకు బాధ్యులైన వారిని జవాబుదారీగా చేయకుండా, కష్టపడి చదివే విద్యార్థులను ప్రభుత్వం ఎందుకు శిక్షిస్తోందని ప్రశ్నిస్తూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన ఎక్స్‌లో డిమాండ్ చేశారు.

సీజేపీ కార్యకర్తలపై పోలీసుల చర్యను విమర్శిస్తూ రాహుల్‌ గాంధీ ఒక వీడియో సందేశాన్ని కూడా ఎక్స్‌లో షేర్‌ చేసారు. విద్యా వ్యవస్థపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులను లాఠీలతో బాదుతూ, నిర్బంధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. “పత్రాలను లీక్ చేసిన నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు — కానీ సరైన సమస్యలు లేవనెత్తుతున్న విద్యార్థులను ఈడ్చుకెళ్లి కొడుతున్నారని” ఆయన అన్నారు.

“ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న అబ్బాయిలు, అమ్మాయిలు నేరస్తులు కాదు. వారు తమ హక్కులను — అంటే నిష్పక్షపాతమైన, గౌరవప్రదమైన, సక్రమంగా పనిచేసే విద్యా వ్యవస్థను — డిమాండ్ చేస్తున్నారని” రాహుల్‌ గాంధీ నొక్కి చెప్పారు. పోలీసులు టియర్‌గ్యాస్, లాఠీ ఛార్జీలను ప్రయోగించడం అప్రజాస్వామికమని, భారతదేశ నైతిక విలువలకు విరుద్ధమని ఆయన అభివర్ణించారు.

ఆర్‌ఎస్‌ఎస్ విద్యా వ్యవస్థను చేజిక్కించుకుందని, ఇది యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. మోదీ ప్రభుత్వం యువతను అగౌరవపరుస్తుందని, “అబద్ధం, హింస” అనే సూత్రాలపై పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

జనాభాలో అధికశాతం ఉన్న భారతదేశ యువత నుండి ఈ నిరసనలు సహజ ప్రతిస్పందనగా ఉన్నాయని, వారి డిమాండ్లను అణచివేయకుండా గౌరవించాలని విపక్షనేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.