హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగునీటి ప్రాజెక్టులకు నీటి ప్రవాహం దాదాపుగా లేకపోవడంతో, తెలంగాణలో వ్యవసాయ రంగంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగనుంది. రాష్ట్ర ఇంధన శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు – నవంబర్ మధ్య కీలక సమయంలో, కేవలం వ్యవసాయ పంప్ సెట్ల కోసమే రోజుకు సుమారు 7,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది.
వరి, పత్తి వంటి నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలను సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఈ రెండు ప్రధాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ఇటీవల వరకు రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి మట్టాలు దాదాపు పడిపోవంటంతో, పంటలను కాపాడుకుని ఏడాది చివరలో దిగుబడి సాధించడానికి పంప్ సెట్లను నడపడం తప్ప రైతులకు వేరే మార్గం లేకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పంప్ సెట్లు పనిచేస్తున్నాయి. అయితే, ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది.
ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ డిమాండ్ అత్యధిక స్థాయికి చేరనుంది. వ్యవసాయ రంగ అవసరాలను తీర్చడానికి వచ్చే నెల నుండి రోజుకు సుమారు 6,500 నుండి 7,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. గత ఖరీఫ్ సీజన్లలో విద్యుత్ డిమాండ్ సగటున రోజుకు 3,500 మెగావాట్లకు మించి ఉండేది కాదు. “రాష్ట్ర ప్రభుత్వం ఏటా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 14,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో అన్ని పంప్ సెట్లు నడిపితే, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు రూ. 14,500 కోట్లకు పెరిగే అవకాశం ఉంది” అని ఉన్నతాధికారులు తెలిపారు.
వ్యవసాయ అవసరాల కోసం పంప్ సెట్లపై ఆధారపడే రైతుల సంఖ్య పెరగడం రాష్ట్రానికి పెద్ద భారం కానుంది. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్న నేపథ్యంలో, ఎక్కువ గంటల పాటు పంప్ సెట్లను నడపడం వల్ల 2027 రుతుపవనాల సీజన్ వరకు ఇతర గృహ అవసరాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడే మరో సంక్షోభం తలెత్తవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో, వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు TGSPDCL చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నందున, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. భూగర్భ జలాల పరిరక్షణ చర్యలతో పాటు నీటిని ఆదా చేసే పద్ధతులను కూడా పాటించాలని రైతులకు సూచించారు.
