న్యూఢిల్లీ: విద్యార్థులను ‘క్షమించడం’ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సరికావని, విద్యార్థులకు ‘క్షమాపణ’ చెప్పాల్సింది ప్రభుత్వమేనని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీక్, తత్ఫలితంగా పరీక్ష రద్దు కావడంతో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు వైద్య విద్యార్థులు గోపిక, రోషిణి, వెట్రి ఆనందన్ల కుటుంబాలతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పంచుకుంటూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
శనివారం తన తమిళనాడు పర్యటన సందర్భంగా ఆయన ఆ కుటుంబాలను కలిశారు.’ నా తమిళనాడు పర్యటన సందర్భంగా, నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దు కారణంగా ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువ వైద్య విద్యార్థులు గోపిక, రోషిణి, వెట్రి ఆనందన్ల కుటుంబాలను కలిశాను. ప్రతి కుటుంబంలోనూ ఒకే బాధాకరమైన ప్రశ్న మిగిలింది: నిజాయితీపరులైన, కష్టపడి చదివే విద్యార్థులు ఒక నిజాయితీ లేని వ్యవస్థకు ఎందుకు మూల్యం చెల్లించాలి?’ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం లీకవ్వడం వల్ల పరీక్ష రద్దు కావడం, బలవంతంగా మళ్లీ పరీక్ష నిర్వహించాల్సి రావడం, యువ మనసులపై భరించలేని ఒత్తిడి పడటం జరిగిందని ఆయన అన్నారు.
‘ప్రతి గణాంకం వెనుక ఒక కలలు కనే బిడ్డ, పూడ్చలేని నష్టంతో జీవిస్తున్న ఒక కుటుంబం ఉంది,’ అని ఆయన అన్నారు. ‘నేను వారి బాధను విన్నాను. కష్టానికి గౌరవం ఇచ్చే, పరీక్షలు నిష్పక్షపాతంగా జరిగే, విద్యాసంస్థలు విఫలమయ్యాయనే కారణంతో ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా ఉండే విద్యా వ్యవస్థ కోసమే మా పోరాటం,’ అని లోక్సభ ప్రతిపక్ష నేత అన్నారు.
ప్రధానమంత్రి విద్యార్థులను ‘క్షమించడం’ గురించి మాట్లాడుతున్నారు. ఈ తల్లిదండ్రుల మాటలు విన్న తర్వాత నా నమ్మకం మరింత బలపడింది: భారతదేశ విద్యార్థులకు క్షమాపణ అవసరం లేదు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ మేరకు ముగ్గురు విద్యార్థుల కుటుంబాలతో మాట్లాడుతున్న దృశ్యాలను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. మల్లపురంలో మృతుల కుటుంబాలతో ఆయన మాట్లాడుతూ… “తమ బిడ్డను కోల్పోయి తల్లిదండ్రులు విలపించడం చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదు. కోల్పోయిన ప్రతి చిన్నారి ప్రాణం వెనుక, ఎప్పటికీ వీడని బాధను మోస్తున్న ఒక కుటుంబం, విచ్ఛిన్నమైన విద్యా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు ఉంటాయి. లీకైన ప్రశ్నపత్రాలు, రద్దయిన పరీక్షలు, సంవత్సరాల తరబడి చేసిన కృషి రాత్రికి రాత్రే నాశనమైంది. మన విద్యార్థులతో నిజాయితీగా ఉండని వ్యవస్థలో, వారిని నిజాయితీగా చదవమని చెప్పటం విడ్డూరంగా ఉందని రాహుల్ అన్నారు.
“‘విద్యార్థులను క్షమించడం గురించి మాట్లాడేంత ధైర్యం ప్రధానమంత్రికి ఉంది. తమ బిడ్డను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఒక్క కుటుంబాన్నైనా ఆయన కలిశారా? లేదా ప్రశ్నపత్రాల లీకుల వల్ల తమ మొత్తం పొదుపు, జీవితం, సమయం, కలలు అన్నీ కోల్పోయిన వారిని కలిశారా? సమాధానం లేదు! భారతదేశ విద్యార్థులకు ప్రధానమంత్రి క్షమాపణ అవసరం లేదు; మోదీజీ వారికి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
కాగా, శుక్రవారం ఒక వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ, నీట్ అవకతవకలపై జరిగిన నిరసనల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద తనను, తన దివంగత తల్లిని దూషించారని చెప్పారు. అటువంటి “దారితప్పిన పిల్లలను” కోర్టుకు లాగడం వల్ల సమస్య పరిష్కారం కాదని, దానికి బదులుగా తాను వారిని క్షమించాలనుకుంటున్నానని ఆయన అన్న విషయం తెలిసిందే.


