అయోధ్య: అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన కానుకల దొంగతనంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన రెండవ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఆలయ ట్రస్ట్ పరిపాలనా పనితీరుకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించేందుకు తన విచారణను విస్తరించనుందని వర్గాలు తెలిపాయి.
వర్గాల సమాచారం ప్రకారం, లక్నో రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్ నేతృత్వంలోని సిట్, భక్తుల కానుకల మళ్లింపు ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను కొత్తగా విశ్లేషించడంతో పాటు అదనపు పత్రాలను కూడా కోరే అవకాశం ఉంది. ఈ బృందం త్వరలో అయోధ్యను సందర్శించనుంది.
కాగా, సిట్లో అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, అయోధ్య ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ కూడా ఉన్నారు. ఈ దర్యాప్తులో ఒక ఫోరెన్సిక్ ఆడిటర్, మరో నిపుణుడిని కూడా నియమించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాలు, దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాల వెలుగులో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యకర్తల పాత్రను సిట్ పరిశీలిస్తుందని వర్గాలు తెలిపాయి.
ఆరోపిత ఈ నేరంలో ఎవరికైనా ప్రమేయం ఉందో లేదో నిర్ధారించుకోవడానికి, విరాళాల సేకరణ, లెక్కింపుతో సంబంధం ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, అవుట్సోర్స్ సిబ్బంది, ఇతర సిబ్బందిని కూడా ఈ సిట్ తాజాగా విచారిస్తోంది. కొత్తగా ఏర్పాటైన సిట్ 200 మందికి పైగా విచారణ కోసం నోటీసులు జారీ చేసిందని, ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని మొదటి సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆరోపించిన దొంగతనానికి సంబంధించి పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి, ట్రస్ట్ కార్యనిర్వాహకుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
ఆలయంలో జరిగే మతపరమైన కార్యక్రమాలు, పండుగల ఖర్చులో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలను కూడా దర్యాప్తు పరిధిలోకి చేర్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి. విరాళాల నిర్వహణపై ట్రస్ట్ నిఘాను పెంచిన తరుణంలో ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. బంగారం, వెండి, ఇతర కానుకలకు సంబంధించిన అవకతవకలపై దర్యాప్తు తుది దశకు చేరుకుందని ట్రస్ట్ సభ్యుడు మహంత్ దినేంద్ర దాస్ తెలిపారు.
జూలై 25 నుంచి విరాళాల నిర్వహణ ప్రక్రియలోని ప్రతి దశను నిరంతర వీడియో నిఘాలో ఉంచారు. పారదర్శకతను పెంచేందుకు అదనపు సీసీటీవీ కెమెరాలు, ఎనిమిది మంది సభ్యుల పర్యవేక్షణ బృందాన్ని కూడా మోహరించారు. ఆలయంలో పూజలు, దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలిపారు.
