న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల క్రూరత్వంపై, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ యువ నిరసనకారుల వెనుక నిశ్శబ్దంగా నిలబడి, వారి మాటలను శ్రద్ధగా వింటూ, భరోసా ఇస్తూ నవ్వుతూ, వారిని నిరంతరాయంగా మాట్లాడనిస్తూ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రెండు వారాల లోపే ఇది ఆయనకు రెండోసారి. జూలై 25న, రాహుల్ గాంధీ తన పక్కన ఐసా (AISA) అధ్యక్షురాలు నేహా బోరా, ఇతర విద్యార్థి కార్యకర్తలతో కలిసి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.
కాగా, రాహుల్ గాంధీ సంభాషణను తానే నడిపించకుండా, విద్యార్థులు, కార్యకర్తలు తమపై జరిగిన దాడులు, నిర్బంధం, బెదిరింపుల అనుభవాలను మీడియాకు చెప్పుకోనిచ్చారు. ఆ తర్వాత జోక్యం చేసుకుని, మోదీ ప్రభుత్వం విద్యార్థులను, జెన్ జెడ్ నిరసనకారులను ప్రభుత్వం వేధించడానికి ప్రయత్నిస్తోందని పునరుద్ఘాటించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మళ్లీ మాటలతో విరుచుకుపడ్డారు. “అమిత్ షా ఎక్కడ దాక్కున్నారు?” అని ప్రశ్నించారు. పోలీసు కాల్పులు, తదనంతర అణచివేతకు హోం మంత్రి “బాధ్యుడై ఉండాలి లేదా అసమర్థుడై ఉండాలి” అనే తన ఆరోపణను ఆయన పునరుద్ఘాటించారు.
“ఈ యువతను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా మాట్లాడటమే ఒక సాహస చర్య,” అని రాహుల్ గాంధీ అన్నారు. మీడియాను ఎదుర్కోవడానికి విద్యార్థులు చూపిస్తున్న సంసిద్ధతకు, అలా చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, షా చూపిస్తున్న అయిష్టతకు మధ్య ఆయన వ్యత్యాసాన్ని చూపారు.
“మేము కొంతమంది యువ నిరసనకారులతో స్వేచ్ఛగా, నిష్కపటంగా మాట్లాడాము. తమపై ఎలా దాడి జరిగిందో, కొట్టబడ్డారో, బెదిరింపులకు గురయ్యారో వారు చెప్పారు. వారిని చూసి, వారితో పాటు వేలాది మంది యువ భారతీయులు చేసిన దానికి నేను చాలా గర్వపడుతున్నాను. వారు రాజ్యాంగాన్ని పరిరక్షించారు. వారు భారతదేశ భావనను, భారతదేశ భవిష్యత్తును కాపాడారు. లోపాలతో విఫలమవుతున్న విద్యా వ్యవస్థపై ఫిర్యాదు చేయడం నేరం కాదు. నిజానికి, వ్యవస్థను మార్చాలి, సరిదిద్దాలి. మాకు మెరుగైన విద్యా వ్యవస్థ, పరీక్షల లీకేజీలకు ముగింపు, మన దేశ యువతకు సురక్షితమైన భవిష్యత్తు కావాలని” రాహుల్ గాంధీ అన్నారు.
మీడియాతో మాట్లాడిన వారిలో ముంబైకి చెందిన యువతి రియా అహిర్ కూడా ఉన్నారు. ముంబైలో జరిగిన నిరసనల సమయంలో పోలీసు వ్యాన్ను ఒంటరిగా ఆపే ఆమె ప్రయత్నం ఆమె బాగా వైరల్ అయింది. విద్యార్థులకు మద్దతుగా నిలిచినందుకు సోషల్ మీడియాలో తనపై నిరంతర ట్రోలింగ్, దూషణలు ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.
“రైట్వింగ్ వారు నన్ను ప్రచారం కోసం ఆరాటపడేదాన్ని అని అన్నారు. కానీ నేను ఫోటోల కోసం అక్కడికి వెళ్ళలేదు. దాదాపు 20 మంది విద్యార్థులను పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే నేను పోలీసు వ్యాన్ ముందు నిలబడ్డానని” ఆమె పేర్కొన్నారు, అలాగే ప్రధాన స్రవంతి మీడియా సృష్టిస్తున్న కథనాన్ని ప్రశ్నించారు.
నిరసనలో పాల్గొనేందుకు గురుగ్రామ్ నుండి వచ్చిన నూతన్ టప్పో, నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడాన్ని తాను స్వయంగా చూశానని ఆరోపించారు. ఈ ఘటనలో గాయపడిన టప్పో, జూలై 20 సాయంత్రం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో తన కుడి చెవికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. పెల్లెట్ గన్లను సంయమనంతో వాడారని, ఆందోళనను అణచివేసే సమయంలో పోలీసులు ఎలాంటి అరాచకాలకు పాల్పడలేదని ప్రభుత్వం, మీడియాలోని కొన్ని వర్గాలు చేస్తున్న వాదనలను టప్పో చెప్పిన వివరాలు సవాలు చేస్తున్నాయి.
మరొక విద్యార్థి ఫరా నాజ్ మాట్లాడుతూ… పోలీసులు తనను గంటల తరబడి అదుపులోకి తీసుకున్న విషయాన్ని వివరించారు. తన పేరు విన్న తర్వాత తాను ముస్లిం అని పోలీసులు గుర్తించారని, అటువంటి వారి కోసం ప్రత్యేక జాబితా తయారు చేస్తామని అధికారులు బెదిరించారని ఆమె ఆరోపించారు.
“వారు నా పేరు అడిగారు, ఆ తర్వాత అటువంటి ‘దేశద్రోహుల’ కోసం ప్రత్యేక జాబితా తయారు చేస్తామని అన్నారు; కానీ మేము దేశం కోసం పోరాటం కొనసాగిస్తాం,” అని ఆమె అన్నారు.
“మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసినందుకే మాపై ఇంతటి అరాచకం జరిగింది; ఒకవేళ అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేసి ఉంటే, వారు మమ్మల్ని కాల్చి చంపేవారేమో,” అని భరత్ బనాయ్ అన్నారు.
“వ్యవస్థ నుండి మాకు రక్షణ లభించాలి. కానీ ఆ వ్యవస్థే మాకు వ్యతిరేకంగా మారితే, మేము ఎక్కడికి వెళ్ళాలని?” ఒక విద్యార్థి నిరసనకారుల ఆవేదనను ప్రతిబింబించేలా ప్రశ్నించారు:
ఈ సంభాషణ అంతటా రాహుల్ గాంధీ వారి వెనుక నిశ్శబ్దంగా నిలబడగా, కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని రాజకీయ విలేకరుల సమావేశంగా కాకుండా, యువ నిరసనకారులు తమ అనుభవాలను నేరుగా దేశానికి తెలియజేసే వేదికగా చూపించడానికి ప్రయత్నించింది.
“లోపభూయిష్టంగా ఉండి విఫలమవుతున్న విద్యావ్యవస్థ గురించి ఫిర్యాదు చేయడం నేరం కాదు. నిజానికి, ఆ వ్యవస్థను మార్చాలి, సరిదిద్దాలి. మాకు మెరుగైన విద్యావ్యవస్థ, పరీక్షా పత్రాల లీకేజీల అంతం, దేశ యువతకు సురక్షితమైన భవిష్యత్తు కావాలి. వారి ఇళ్లకు గూండాలను పంపడం ద్వారా ‘క్షమాపణ’ చెప్పడం అనేది పూర్తిగా అర్థరహితం,” అని రాహుల్ గాంధీ అన్నారు.
