కొత్తగూడెం: దేశానికి తగినంత బొగ్గు సరఫరాను అందించడంతో పాటు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో తన ఉనికిని విస్తరించడం ద్వారా దేశ ఇంధన భద్రతకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) దోహదపడుతుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాస్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పోలో భాగంగా “ఇంధన భద్రత, విద్యుత్ ఉత్పత్తి” అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో సీఎండీ మాట్లాడుతూ… దశాబ్దాలుగా బొగ్గును సరఫరా చేయడం ద్వారా దేశ ఇంధన అవసరాలకు ఎస్సిసిఎల్ దోహదపడుతోందని అన్నారు.
రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా ఎస్సిసిఎల్ తెలంగాణ జెన్కో,ట్రాన్స్కోలతో సమన్వయంతో పనిచేస్తోందని ఆయన చెప్పారు. తన వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, ఎస్సిసిఎల్ థర్మల్ పవర్, సోలార్ పవర్, కీలక ఖనిజాల రంగాలలోకి ప్రవేశించిందని ఆయన తెలిపారు. అయితే, రాబోయే నాలుగు దశాబ్దాల పాటు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని, అందువల్ల రాబోయే సంవత్సరాల్లో బొగ్గు ఉత్పత్తిని పెంచడం అవసరమని సింగరేణి ఛైర్మన్ జ్యోతి అన్నారు.
“పునరుత్పాదక ఇంధన రంగంలో తన బాధ్యతను నెరవేరుస్తూనే, దేశ భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చడానికి బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు ఎస్సీసీఎల్ కృషి చేస్తుందని” సింగరేణి సీఎండీ అన్నారు. ఈ ప్యానెల్ చర్చకు ప్రొఫెసర్ పవన్ కుమార్ పరానంది మోడరేటర్గా వ్యవహరించారు. ఈ ఎనర్జీ సమ్మిట్ కు తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ హాజరుకాగా… ప్యానెల్ డిస్కషన్ లో సింగరేణి ఛైర్మన్ తో పాటు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ సీఎండీ శ్రీ దేవేంద్ర శృంగి, ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ శర్మ, గ్రిడ్ కో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సత్యప్రియ రథ్, ఒడిశా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ శ్రీ కేదార్ రంజన్ పాండు, ఛత్తీస్ ఘడ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ ఎండీ శ్రీ సంజీవ్ కుమార్ కటియార్ తదితరులు పాల్గొన్నారు.
