న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను నియమించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేగింది. వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్లకు చెందని వ్యక్తిని ఎంపిక చేశారని, ఈ రెండు సంస్థలపై ప్రభుత్వానికి విశ్వాసం లేదని పేర్కొంటూ కాంగ్రెస్ ఈ నియామకాన్ని ప్రశ్నించింది.
మరోవైపు, విరాళాల దొంగతనం కేసులో న్యాయం జరగాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది, ఆర్థిక అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, పలువురు స్థానిక సాధువులు, మహంతులు ఈ నియామకాన్ని తప్పుబట్టారు. ఒక మతపరమైన, ఆధ్యాత్మిక సంస్థ లేదా ట్రస్ట్కు అధిపతిగా సాధువులు, దార్శనికులు, మత పెద్దలు ఉండాలే తప్ప, మిలిటరీ లేదా రిటైర్డ్ ప్రభుత్వ అధికారులను నియమించడం ఏంటని ప్రశ్నించారు.
ఆలయాలను ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని కొందరు సాధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు ఆరెస్సెస్ (RSS), వీహెచ్పీ (VHP) సంస్థలకు చెందిన వ్యక్తులపై కూడా ప్రభుత్వానికి నమ్మకం పోయిందని, అందుకే బయటి వ్యక్తులను తెచ్చి పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
మంచి వ్యక్తులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని పేర్కొంటూ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసింది. ఇంకోవైపు, ఆలయ నిధులు సురక్షితంగా ఉంటాయని, కొత్త నాయకత్వం పారదర్శకతను నిర్ధారిస్తుందని, ఈ చర్య ఆలయ వ్యవహారాలను వృత్తిపరంగా నిర్వహించడానికి సహాయపడుతుందని పేర్కొంటూ విశ్వ హిందూ పరిషత్ ఈ కొత్త నియామకాన్ని స్వాగతించింది.
వేలాది మంది దరఖాస్తుదారులను విస్తృతంగా పరిశీలించిన తర్వాతే ఈ ఎంపిక జరిగిందని ట్రస్ట్ సభ్యులు ధృవీకరించారు. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా గోవింద్ దేవ్ గిరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
మొత్తంగా ఆలయ నిర్వహణలో పారదర్శకత తెచ్చేందుకు ఈ మార్పులు చేశామని బీజేపీ అంటుండగా.. పాత అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే ఈ ప్రయత్నాలంటూ విపక్షాలు దీనిని ఒక ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకున్నాయి.
