Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం…మరో మృతదేహం లభ్యం!

Share It:

హైదరాబాద్: నాగర్ కర్నూల్‌లోని SLBC సొరంగంలో చిక్కుకున్న మరో కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ బృందం కనుగొంది. దీంతో ఫిబ్రవరి 22న సొరంగం కూలిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు మృతదేహాలను శిథిలాల నుండి వెలికితీసినట్టైంది.

సొరంగంలోని చివరి 50 మీటర్ల ప్రాంతంలో తవ్వకం జరుపుతున్న కొంతమంది రెస్క్యూ కార్మికులు లోకో ట్రాక్ సమీపం నుండి దుర్వాసన రావడాన్ని గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా గుర్తించిన అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో కన్వేయర్ బెల్ట్ శిథిలాలను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు.

కాగా, ఈ దుర్ఘటన జరిగిన నెలా 3 రోజుల తర్వాత రెండో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మినీ ఎక్స్‌కవేటర్ ఉపయోగించి తవ్వకం ప్రయత్నాల సమయంలో కన్వేయర్ బెల్ట్ నుండి సుమారు 50 మీటర్ల దూరంలో మృతదేహం కనుగొన్నారు.

మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ఇంజనీర్‌ మనోజ్‌కుమార్‌గా గుర్తించారు. నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్‌ అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో అతని స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. మనోజ్ కుమార్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల పరిహారం అందించారు.

ఇదిలా ఉండగా ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో మొత్తం 8 మంది గల్లంతయ్యారు. వారిలో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు దొరకగా మిగతా ఆరుగురి ఆచూకీ ఇంకా తెలియలేదు.

మరోవంక హైదరాబాద్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి శివ శంకర్ లోటేటిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆయన ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు సహా 25 ఏజెన్సీలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 700 మంది సిబ్బంది పాల్గొన్నారని అధికారి తెలిపారు.

కూలిపోయిన రాళ్ల శిథిలాలను తొలగిస్తున్నామని, TBM భాగాలను కూల్చివేస్తున్నామని, సొరంగం నుండి మట్టి దిబ్బలు, సిల్ట్ మరియు నీటిని తొలగిస్తున్నామని అధికారి తెలిపారు. ప్రమాదం ఇన్లెట్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినందున గాలి, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయని వారు వివరించారు. ప్రమాద ప్రాంతానికి దాదాపు 30 మీటర్ల దూరం అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా గుర్తించారు. GSI, NGRI శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం సొరంగంలో సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.