హైదరాబాద్: భూ వివాదాలను పరిష్కరించడానికి, భూ పరిపాలనలో పారదర్శకతను నిర్ధారించడానికి, కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… భూ భారతి చట్టం, పోర్టల్ను తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు.
రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంతో అధ్యయనం చేసి తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ప్రతీ మండలంలో సదస్సు నిర్వహించి… కలెక్టర్లు హాజరై… రైతులు, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు.
రాష్ట్రంలో వివాదాలు లేని భూమి విధానం కోసం ప్రభుత్వ దార్శనికతను వివరిస్తూ…ప్రతి మనిషికి ఆధార్ వలే.. ప్రతి భూమికి భూధార్ తెస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రతి భూమికి కచ్చితమైన సరిహద్దులతో రిజిస్ట్రేషన్ చేద్దామని ఆయన పిలుపు నిచ్చారు. త్వరలో ప్రవేశపెట్టనున్న సమగ్ర భూమి డేటాబేస్ వ్యవస్థలో సమగ్ర సర్వేల తర్వాత భూమి కొలతలు, సరిహద్దులపై వివరణాత్మక సమాచారం ఉంటుంది.
భూ భారతి మొదటి దశ నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజా పోరాటాల నుండి పుట్టిన రెవెన్యూ చట్టాలు చివరికి భూమి సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అందించే లక్ష్యంతో ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.
భూ భారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడం, అమలు చేయడం అనే బాధ్యతను ఆయన రెవెన్యూ అధికారులపైనే ఉంచారు. గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులని న్యాయస్థానాలకు పంపారని భూభారతి చట్టంలో రెవెన్యూ యంత్రాగమే ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తుందని సీఎం వివరించారు. అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు, ప్రజలకు తెలపాలని సూచించారు.
“గత పాలనల మాదిరిగా రెవెన్యూ అధికారులను ప్రజలకు దగ్గరగా తీసుకురావడమే లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మొత్తం వ్యవస్థను అన్యాయంగా లక్ష్యంగా చేసుకోబోమని సీఎం భరోసా ఇచ్చారు
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు కమిషన్ సభ్యులు సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.


