న్యూఢిల్లీ : భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతకు భంగం కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించిన ఎక్స్ (X) ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు 8000కి పైగా ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X తెలిపింది.
చట్టాలను ఉల్లంఘించిన అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖుల అకౌంట్లను బ్లాక్ చేయాలని లేకపోతే భారీ జరిమానా విధిస్తామని ఆదేశాలు వచ్చాయి. అయితే నిర్దిష్టంగా ఏ అకౌంట్ల నుంచి చట్టాన్ని ఉల్లంఘించి సమాచారం పోస్ట్ చేసారో భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. చాలా సందర్భాల్లో భారత్ ఇలాగే చేస్తుంది. కేంద్ర ఆదేశాలను మేం పాటిస్తాం. అకౌంట్లను బ్లాక్ చేసే ప్రక్రియను స్టార్ట్ చేశాం.
భారత ప్రభుత్వ నిర్ణయం అంత తేలికైనది కాదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మేం విభేదిస్తున్నాం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. దీనిపై మేం చట్ట ప్రకారం ముందుకెళ్తాం. అని ఎక్స్ కంపెనీ తన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్ పోస్ట్ చేసింది.