….ముహమ్మద్ ముజాహిద్
బక్రీద్ పండుగు వచ్చే ముందు ఖుర్బానీ కోసం ముస్లిములు ప్రయత్నాలు ఆరంబించడం సాధారణంగా ప్రతిచోట కనబడుతుంది. హజ్ చేసే అవకాశం దొరికిన లక్షలాది మంది లబ్బైక్ అంటూ మక్కా నగరానికి వెళతారు. కోట్లాది ముస్లిములు, హజ్ యాత్రకు వెళ్ళలేని వారు మహాప్రవక్త ముహమ్మద్ (స) సంప్రదాయాన్ని పాటిస్తూ, హజ్రత్ ఇబ్రాహీమ్ అపూర్వ త్యాగనిరతిని స్మరిస్తూ పశువులను ఖుర్బానీ ఇస్తారు.
మారుతున్న కాలం, మారుతున్న ఆలోచనలు, వైఖరులు, విధానాల నేపథ్యంలో కొత్త కొత్త వాదనలు పుట్టుకు వస్తున్నాయి. అలాంటి ఆలోచనలు, వైఖరుల్లో ఒకటేమిటంటే, త్యాగనిరతికి చిహ్నంగా దానధర్మాలు చేయవచ్చు కదా, ఖుర్బానీ ఇవ్వడమే ఎందుకన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం కూడా అవసరమే. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు ఒక విషయం చెప్పాలి. ఇస్లాము కట్టడానికి ఐదు మూలస్తంభాల్లో మొదటిది ధార్మిక విశ్వాసం. అల్లాహ్ (దేవుడు) ఒక్కడే, ప్రవక్త ముహమ్మద్ (స) దేవుని సందేశహరుడని విశ్వసించడం. ప్రకటించడం… దేవుడొక్కడే అని విశ్వసించడమంటే సమస్త మానవాళికి, యావత్తు విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అని ప్రకటించడం. అందరి దేవుడు ఒక్కడే అయినప్పుడు మానవులంతా ఆయన దృష్టిలో సమానులే అవుతారు. కాబట్టి మానవులంతా ఒక్కటే. ముహమ్మద్ (స)ను చివరి దైవప్రవక్తగా విశ్వసించడమంటే ఆయన ద్వారా మానవాళి వద్దకు వచ్చిన దైవవాణి ఖుర్ఆన్ ను విశ్వసించి, ఖుర్ఆన్ ఆదేశాల ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స) సంప్రదాయాలు, ఆచరణలను అనుసరించి జీవితం గడపడం. విశ్వాస వచనాన్ని పలకడం, ప్రకటించడం, ఆచరించడం తప్పనిసరి.
ఇక రెండవ మూలస్తంభం సలా లేదా నమాజ్. రోజుకు ఐదు సార్లు దేవుని ముందు హాజరై ప్రార్థించడం. ఇది మనిషిలో ఎల్లప్పుడు ఈ ప్రపంచం శాశ్వతం కాదన్న సత్యాన్ని మరిచిపోకుండా చేస్తుంది. నమాజ్ చెడులకు ఢాలులా ఉపయోగపడుతుందని ప్రవక్త అన్నారు. నమాజు తప్పనిసరి.
మూడవ మూలస్తంభం సౌమ్ లేదా రోజా లేదా ఉపవాసం. యుక్తవయస్సులో ఉన్న ప్రతి ముస్లిమ్ స్త్రీపురుషులు రమదాన్ మాసంలో నెలరోజుల పాటు ఉపవాసాలు పాటించడం తప్పనిసరి. కఠినమైన ఉపవాస నియమాలు పేదసాదల ఆకలిబాధను అనుభవించి తెలుసుకునేలా చేస్తాయి. రమదాన్ మాసంలో విరివిగా దానధర్మాలు చేయాలన్న బోధనలను తూ.చ. తప్పకుండా ముస్లిములు పాటిస్తుంటారు. ఇది కూడా తప్పనిసరి
నాలుగవ మూలస్తంభం జకాత్. ఏడున్నర తులాల బంగారం లేదా దానికి సమానమైన సంపద ఉన్నమనిషి తన సంపదలో ప్రతి సంవత్సరం రెండున్నరశాతం తప్పనిసరిగా పేదసాదలకు ఇవ్వడం. నిర్దిష్ట సంపద ఉన్న ప్రతి ముస్లిముకు ఇది వర్తిస్తుంది. ఇది తప్పనిసరిగా చెల్లించాలి. పైన మనం దానధర్మాలు చేయవచ్చు కదా అనే ప్రశ్న గురించి చెప్పుకున్నాం. ఇస్లాంలో తప్పనిసరిగా చేయవలసిన దానధర్మాలు ఉన్నాయి. జకాత్ మాత్రమే కాకుండా ఇతర దానధర్మాలను కూడా రమజాన్ మాసంలో ప్రోత్సహించడం జరిగింది.
ఐదవ మూలస్తంభం హజ్ యాత్ర. స్తోమత ఉన్న ప్రతి ముస్లిమ్ జీవితకాలంలో ఒకసారైనా హజ్ యాత్ర చేయాలి. ఇది కూడా స్తోమత ఉన్నప్పుడే వర్తిస్తుంది. యావత్తు ప్రపంచం నుంచి వచ్చే వివిధ జాతుల హజ్ యాత్రికులు ఒకచోట కలవడం సర్వమానవ సమానత్వ భావననే కాదు, వసుధైక కుటుంబం అన్న భావనకు సజీవ ఉదాహరణగా మారుతుంది. హజ్ యాత్ర సందర్భంగా ముస్లిములు అక్కడ ఖుర్బానీ ఇస్తారు. హజ్ యాత్ర చేయలేని వారు తమ ఇండ్లలోనే ఉన్నప్పుడు బక్రీద్ పండుగ జరుపుకుని ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ ఇవ్వడం కూడా స్తోమత ఉన్నవారిపైనే విధి. అందరికీ కాదు. అయితే ఖుర్బానీకి చాలా ప్రాముఖ్యం ఉంది. కాని స్తోమత లేనప్పుడు, ఇవ్వలేనప్పుడు దీనిపై పూచీ లేదు.
దానధర్మాలను ప్రోత్సహించడమే కాదు, జకాత్ రూపంలో తప్పనిసరిగా పేదసాదలను ఆదుకునే ఏర్పాటు ఉన్నప్పుడు ఖుర్బానీకి బదులు దానధర్మాలు చేయవచ్చు కదా అనడిగే ప్రశ్నలో నిజాయితీ తక్కువ కనబడుతుంది. ఏది ఏమైనా ఈ ప్రశ్నను మరింత విస్తారంగా చూద్దాం.
కొన్ని చిహ్నాలు విలువైనవిగా భావించబడతాయి. ఉదాహరణకు ఏ దేశానికి సంబంధించిన పతాకాన్నయినా తీసుకోండి. అది ఒక చిహ్నం. ఆ దేశసార్వభౌమాధికారానికి చిహ్నం. అందువల్ల దానికి చాలా విలువ ఉంటుంది. నిజానికి ఏ దేశం జాతీయపతాకమైన ఒక వస్త్రం మాత్రమే. కాని ప్రతిదేశం తన జాతీయపతాకాన్ని కేవలం ఒక వస్త్రంగా భావించదు. అత్యంత విలువైనదిగా చూస్తుంది. దేశప్రేమతో ముడిపడి ఉన్న చిహ్నం అది. దేశప్రతిష్ఠ, దేశగౌరవం, జాతిమర్యాద అన్నింటికి చిహ్నంగా నిలుస్తుంది. క్లుప్తంగా చెప్పేదేమంటే కొన్ని చిహ్నాలకు చాలా విలువ ఉంటుంది.
ఇస్లామ్ లో పశువును ఖుర్బానీ ఇవ్వడం కూడా ఇలాంటి చిహ్నమే. దేవుని కొరకు ఏమైనా త్యాగం చేస్తానన్న సంకల్పాన్ని మనిషి ఖుర్బానీ ద్వారా ప్రకటిస్తాడు. ఖుర్బానీ ఇచ్చే పశువు కేవలం చిహ్నం మాత్రమే. ఇది నమాజు, రోజా, జకాత్ లకు భిన్నమైనది. నమాజులో మనిషి తన ఆరాధన నిర్వర్తిస్తాడు. దైవదాస్యభావన ప్రకటిస్తాడు. ఇది సామూహికమైన ఆరాధన. రోజాలో మనిషి స్వయంగా ఉపవాసాలు ఉండడం ద్వారా తన శరీరాన్ని ఆకలిదప్పులకు గురిచేసి దేవుని పట్ల తన భక్తి ప్రపత్తులను చాటుకుంటాడు. ఇది వ్యక్తిగతమైన ఆరాధన. అలాగే జకాత్ లోను మనిషి తన సంపదను తీసి దానం చేయడం ద్వారా పేదసాదలను ఆదుకునే పని చేస్తాడు. ఇది ఆర్ధికమైన ఆరాధన. పశువును ఖుర్బానీ చేయడం ద్వారా తనలో ఉన్న త్యాగనిరతిని ప్రకటిస్తాడు. ఇక్కడ ఖుర్బానీ చేయబడే పశువు కేవలం చిహ్నం మాత్రమే. అవసరమైతే ఏమైనా త్యాగం చేస్తానన్న సంకల్పాన్ని ఈ చిహ్నం ద్వారా ప్రదర్శిస్తాడు. అంటే ఖుర్బానీ ఒక సంకల్ప ప్రకటన వంటి ఆరాధన. అందువల్లనే దీన్ని మార్చడానికి వీలులేదు.
పశువును ఖుర్బానీ చేయడం అన్నది ఎందుకు చిహ్నంగా మారిందన్నది కూడా గుర్తు చేసుకోవాలి. దైవదాస్యానికి, దైవవిధేయతకు సాటిలేని ఉదాహరణగా జీవితం గడిపిన ప్రవక్త ఇబ్రాహీమ్ (అస) ప్రదర్శించిన త్యాగనిరతికి సంబంధించిన సంఘటన దీని వెనుక ఉంది. దైవాదేశాలను పాటించడానికి తన ముద్దులకొడుకును, లేకలేక పుట్టిన కొడుకును కూడా దేవునికి అర్పించడానికి ఆయన క్షణం వెనుకాడలేదు. తండ్రికి తగిన కుమారుడిగా ప్రవక్త ఇస్మాయీల్ (అస) కూడా అందుకు సంసిద్ధమయ్యారు. ఈ అపూర్వ త్యాగానికి సంబంధించిన సంఘటనను స్మరిస్తూ, ఆ సంఘటనకు చిహ్నంగా పశువును ఖుర్బానీ ఇస్తారు. అందువల్ల దీనికి ఈ ప్రాముఖ్యం ఉంది. అవసరమైతే ధనప్రాణత్యాగాలకు వెనుదీయమన్న సంకల్పాన్ని ప్రకటించే చిహ్నం ఇది.
కాబట్టి బక్రీద్ పండుగలో పశువును ఖుర్బానీ ఇవ్వడానికి దానిదైన ప్రాముఖ్యం ఉంది. దీనికి మరో ప్రత్యామ్నయం లేదు. ఇది ఒక గొప్ప త్యాగాన్ని సూచించే చిహ్నం. నమాజుకు బదులు రోజా ఉండడం కుదరదు. రోజా బదులు జకాత్ కుదరదు. ప్రతి ఆరాధనకు దానిదైన ప్రాముఖ్యం ఉంది. కాబట్టి ఖుర్బానీకి ప్రత్యామ్నయం మరేదీ లేదు.
ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ పండుగ స్ఫూర్తిని అర్ధం చేసుకోకపోవడం వల్ల వస్తున్నాయి. ఖుర్బానీ ద్వారా లభించే మాంసాహారాన్ని పేదలకు పంచడంపై దృష్టి నింపి పేదలకు ఆహారం అందడమే అసలు స్ఫూర్తి, కాబట్టి వారికి అన్నదానం చేయడం, పేదపిల్లలను చదివించడం వగైరా పనులకు ఈ డబ్బు ఖర్చు చేయొచ్చు కదా అన్న వాదన వినిపిస్తుంది. పేదలకు, అన్నార్తులకు ఆదుకోవడానికి, పేదపిల్లలను చదివించడానికి ఇతర ఏర్పాట్లు చాలా ఉన్నాయి. జకాత్ ద్వారా జరిగేది అదే. ఆ పనులు ముస్లిమ్ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఖుర్బానీ మాంసాన్ని పేదలకు పంచడం, ఆ విధంగా పేదసాదలకు మాంసాహారం లభించడం ఖుర్బానీ వల్ల లభించే సామాజిక ప్రయోజనాలు. కాని ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం మనసులో సంకల్పాన్ని ఖుర్బానీ ద్వారా ప్రకటించడం. అదేమంటే, ఈ రోజు ఈ పశువును ఖుర్బానీ చేసినట్లే అవసరమైతే ధనప్రాణాలన్నీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకల్పాన్ని ప్రకటించడం. ఖుర్బానీలో ఇది ముఖ్యమైన, ప్రథమమైన అంశం. ఇదే ఖుర్బానీ స్ఫూర్తి. కాబట్టి ఖుర్బానీ స్ఫూర్తి అంటే త్యాగనిరతిని పశువును ఖుర్బానీ చేసి ప్రకటించడం ద్వారానే చేస్తారు. ఖుర్బానీ చేసే పశువును ఎంతో ప్రేమగా సాకుతారు. ఆ పశువు పట్ల ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధాన్ని తెంచుకుని ఖుర్బానీ చేయడానికి సిద్ధపడడం ద్వరా త్యాగనిరతిని ప్రకటిస్తారు. పేదసాదలను ఆదుకోడానికి జకాత్, ఫిత్రా, సదకా వంటి అనేక ఏర్పాట్లు వేరుగా ఉన్నాయి. ఒకదానికి బదులు మరొకటి చేయలేం.
బక్రీద్ పండుగు వచ్చే ముందు ఖుర్బానీ కోసం ముస్లిములు ప్రయత్నాలు ఆరంబించడం సాధారణంగా ప్రతిచోట కనబడుతుంది. కాని గమనించవలసిన విషయమేమంటే ఇది ఒక ఆరాధన. ఏదన్నా పని ఆరాధన అన్న భావంతో చేయకపోతే అదో శుష్క ఆచారమై పోతుంది. అలవాటుగా చేసే పనయిపోతుంది. దైవప్రసన్నత కొరకు కాకుండా కేవలం అలవాటుగా చేసేది ఆరాధన కాదు. ఖుర్బానీ అలాంటిది కాదు. ఇది ఆరాధన. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్ సమాజం అనేక సమస్యల్లో ఇరుక్కుని సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ముస్లిములు ఖుర్బానీ ఒక ఆరాధనగా, త్యాగానికి చిహ్నంగా, ఎలాంటి త్యాగానికైనా వెనుదీయమన్న సంకల్పాన్ని ప్రకటించే చిహ్నంగా ఖుర్బానీ ఇస్తున్నామా లేక అలవాటుగా ఆచారంగా ఖుర్బానీ ఇస్తున్నామా అన్నది సమీక్షించుకోవాలి.
ఎందుకంటే, రోజుకు ఐదు పూటల నమాజు అనేది అతి ముఖ్యమైన ఆరాధనల్లో ఒకటి. ప్రళయదినాన అడగబడే మొదటి ప్రశ్న కూడా నమాజు గురించినదే. కాని ఎంతమంది ఉత్సాహంగా రోజుకు ఐదుపూటలు నమాజుకు హాజరవుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబేమీ కష్టం కాదు. నమాజులో కనిపించని ఉత్సాహం ఖుర్బానీలో కనిపించడం విచిత్రం. ఖుర్బానీ పశువుల కోసం చూపించే ఉత్సాహం, చాలా ముఖ్యమైన ధార్మిక విధి నమాజు విషయంలో కనబడదు. ఇది మనం ఆలోచించుకోవలసిన విషయం. ఇక్కడే మనం ఖుర్బానీ స్ఫూర్తి గురించి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ఖుర్బానీ స్ఫూర్తి ఏమంటే, దైవమార్గంలో అవసరమైతే ఏదైనా త్యాగం చేయాలన్నది. నమాజును అలక్ష్యం చేసే కార్యకలాపాలు, ఆకర్షణలు, అభిలాషలు, ఆకాంక్షలు, అవసరాలు, సుఖదుఖాలు ఏమైనా గాని వాటిని పక్కనపెట్టే త్యాగనిరతి చూపిస్తున్నామా అన్నది ఆలోచించుకోవాలి. ఇదేకదా ఖుర్బానీ స్ఫూర్తి. మనిషి తన ప్రవృత్తి, తన వైఖరి అన్నీ దైవాభీష్టం, దైవప్రసన్నత పొందేవిధంగా మలచుకోవడం, అందుకు అడ్డుగా ఉండే అన్నింటిని త్యజించడమే ఖుర్బానీ స్ఫూర్తి. నిస్సందేహంగా ఖుర్బానీ దేవునికి అత్యంత ఇష్టమైన ఆచరణ. ఇది ఒక ఆరాధన. ఈ ఆరాధనలో పశువును ఖుర్బానీ చేయడం ఒక చిహ్నం.
‘‘నా నమాజ్ నా సకల ఉపాసనారీతులు, నా జీవనం, నా మరణం-సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది. అందరికంటే ముందు విధేయతతో తలవంచేవాణ్ణి నేనే.’’ (అల్ అన్ ఆమ్ : 161)
కాబట్టి బక్రీద్ అనేది ఒక త్యాగోత్సవం
ఈ రోజు…. ఇల్లు శుభ్రం చేస్తాం .. శుభ్రమైన దుస్తులు ధరిస్తాం .. మస్జిదు వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది .. ప్రశాంతంగా పండగ ప్రార్థనలు చేస్తాం …పరిశుభ్రత .. పరిశుద్ధత.. ఇవి ఇస్లాం ధర్మంలో అంతర్భాగాలు
’’చెడుగుకు దూరంగా ఉండేవారిని, పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడని‘‘ అని ఖుర్ఆన్ లోని అల్ బఖర్ సూరా, 222 వ వాక్యంలో అల్లాహ్ స్వయంగా చెప్పాడు.
అంతేకాదు మరోచోట దివ్యఖుర్ఆన్ లో
అల్లాహ్ కు పరిశుద్ధతను పాటించేవారు అంటేనే ఇష్టం .. అని ఖుర్ఆన్, తౌబా సూరా 108వ వాక్యంలో అల్లాహ్ బోధించాడు.
శుచి శుభ్రతలు సగం విశ్వాసం అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స)
ఖుర్ఆన్ పారాయణం, నమాజు, కాబా ప్రదక్షిణం ఇలాంటి ఆరాధనలేవీ శుచి శుభ్రతల్లేకుండా చేయలేం
బక్రీద్ రోజు …. ఖుర్బానీ ఇస్తాం… కాని పరిసరాల పరిశుభ్రతను పట్టించుకుంటున్నామా?
ఆలోచించండి.
వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండడం .. శుభ్రమైన దుస్తులు ధరించడం .. ఇల్లు శుభ్రంగా ఉండడం .. ప్రార్థనల ప్రదేశం పరిశుభ్రంగా ఉంటే సరిపోదు
పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి.
పరిశుభ్రమైన పరిసరాలతో.. ఆదర్శవంతమైన బక్రీద్ జరుపుకుందాం
బక్రీద్ పండగ రోజు ఖుర్బానీ వ్యర్థాలు లేకుండా రోడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూద్దాం.