హైదరాబాద్ : అభివృద్దిలో జెట్స్పీడుగా దూసుకెళ్తున్న విశ్వనగరం హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వచ్చేసింది. రఫేల్ యుద్ధ విమానాల నిర్మాణంలో కీలకమైన భాగాలైన ఫ్యూజ్లేజ్లు మన భాగ్యనగరంలోనే తయారవుతాయి. ఈమేరకు డస్సాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సంయుక్తంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం భారత రక్షణ రంగానికి పెద్ద ప్రోత్సాహకం కానుంది.
భారత నౌకాదళం కోసం 26 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారతదేశం ఇటీవల సంతకం చేసిన 7.4 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఈ భాగస్వామ్యం పూర్తి చేస్తుంది. అంతేకాదు భారత వైమానిక దళంలోని 36 విమానాలకు అదనంగా మరిన్ని ఫైటర్ జెట్లు తోడవుతాయి.
ఒక పత్రికా ప్రకటన ప్రకారం, హైదరాబాద్ యూనిట్లో రఫేల్ యుద్ధవిమానం ముందు, వెనుక, మధ్య భాగాలు తయారవుతాయి. మొత్తంగా ఈ కేంద్రం యుద్ధవిమానం తయారీకి కీలకం కానుంది.
మొదటి ఫ్యూజ్లేజ్ విభాగాలు 2028 ఆర్థిక సంవత్సరంలో అసెంబ్లీ లైన్ నుండి ప్రారంభమవుతాయని, ఈ సౌకర్యం నెలకు రెండు పూర్తి ఫ్యూజ్లేజ్లను అందించగలదని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) తెలిపింది.
“డస్సాల్ట్ ఏవియేషన్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశంలో రాఫెల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూజ్లేజ్ను తయారు చేయడానికి నాలుగు ఉత్పత్తి బదిలీ ఒప్పందాలపై సంతకం చేశాయి, ఇది దేశ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, సప్లై చైన్కు మద్దతు ఇవ్వడంలో గణనీయమైన ముందడుగును సూచిస్తుంది” అని ప్రకటన పేర్కొంది.
డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ఈ భాగస్వామ్యాన్ని ఎంతో కీలకమైందిగా అభివర్ణించారు. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ ఫ్యూజ్లేజ్ల తయారీ మొదలుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత ఏరోస్పేస్ రంగంలో టాటా సంస్థల భాగస్వామ్యం, నాణ్యత ప్రమాణాలపై డస్సాల్ట్ నమ్మకాన్ని ఇది సూచిస్తుందని ఆయన తెలిపారు.
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ సుకరం సింగ్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం భారత ఏరోస్పేస్ రంగంలో ఒక కీలక మైలురాయి. భారత్లో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా యుద్ధ విమానాల నిర్మాణం జరుగుతున్నట్టు ఇది స్పష్టం చేస్తుందని అన్నారు. డస్సాల్ట్ సంస్థ భారత్పై ఉంచిన విశ్వాసం, భవిష్యత్లో మరో దశకు తీసుకెళ్లే అవకాశం ఇది అని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు ప్రపంచ వేదికలకు మద్దతు ఇవ్వగల ఆధునిక, బలమైన ఏరోస్పేస్ తయారీ ఎకోసిస్టమ్ను స్థాపించడంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిని కూడా ఇది ప్రతిబింబిస్తుంది” అని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ అన్నారు.