బెంగళూరు: ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో కర్ణాటక పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్సిబికి చెందిన ఉన్నతాధికారి, మార్కెటింగ్ మేనేజర్ నిఖిల్ సోసలే అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఆయన ముంబైకి వెళుతుండగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు.
మార్కెటింగ్ అధికారి సోసలే ఆర్సిబి అన్ని ప్రమోషనల్ కార్యకలాపాలను నిర్వహిస్తారు. అంతేకాదు ఆటగాళ్లకు, ఫ్రాంచైజీకి మధ్య ప్రధాన అనుసంధానకర్త కూడా. ఆయన జట్టు సోషల్ మీడియా హ్యాండిల్స్ను కూడా నిర్వహిస్తారు. అరెస్టయిన మిగతా వారిలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డిఎన్ఎ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు – సునీల్ మాథ్యూ (వైస్ ప్రెసిడెంట్, డిఎన్ఎ కోసం ఐపిఎల్ ఈవెంట్లను నిర్వహిస్తారు), కిరణ్, సుమంత్ ఉన్నారు.
భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామాలు సంభవించాయి. ఈమేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య… RCB బృందం, DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను అరెస్టు చేయాలని ఆదేశించారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్షయ్ నేతృత్వంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ రాత్రిపూట నిర్వహించిన ఆపరేషన్లో అరెస్టులు జరిగాయని పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు నేర దర్యాప్తు విభాగానికి అప్పగించే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఇద్దరు అధికారులు – కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరామ్ – పరారీలో ఉన్నారు. వారిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
కాగా, బుధవారం సాయంత్రం స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగింది, అక్కడ RCB విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ సంఘటనలో 60 మందికి పైగా గాయపడ్డారు. నిన్న, ఈ సంఘటనకు సంబంధించి బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద, అనేక మంది సీనియర్ పోలీసు అధికారులను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సస్పెండ్ చేశారు.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, బెంగళూరు మెట్రోపాలిటన్ టాస్క్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్ను “తక్షణమే బదిలీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు” అదనపు డీజీని బెంగళూరు పోలీస్ కమిషనర్గా నియమించారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డి.కె. శివకుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ చేసిన డిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. బిజెపి “మురికి రాజకీయాలు” ఆడుతోందని అధికార కాంగ్రెస్ ఆరోపించింది.
ఎఫ్ఐఆర్ ప్రకారం… ఆర్సిబి ఫ్రాంచైజీ పోలీసు ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఈ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో ప్రకటించింది.
అంతకుముందు, ఈ విషాదం గురించి డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన కారణంగా బెంగళూరు తన ప్రతిష్టను కోల్పోయిందని అన్నారు. కాగా, బాధితుల కుటుంబాలు తొక్కిసలాటకు కారణం అధికారులే అని నిందించారు.