హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న 5 డిఎలలో 2 డిఎ బకాయిలను చెల్లించాలని నిర్ణయించింది. మొదటి డిఎ వెంటనే విడుదల చేయనున్నారు. రెండవ డీఏను 6 నెలల తర్వాత చెల్లిస్తారు.
ఈమేరకు నిన్న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగులు హెల్త్ కార్డుల పథకం కోసం ప్రతి ఉద్యోగి రూ.500 చొప్పున ఇవ్వాలని, ఏడాది పాటు వాళ్లు జమ చేసిన సొమ్ముకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తాం. దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. అధికారులు, ఉద్యోగుల నుంచి కొంత మంది చొప్పున ట్రస్టులో సభ్యులుగా ఉంటారు. ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా.. ఈ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలన్నింటినీ నెలకు రూ. 700 కోట్లకు తక్కువ కాకుండా చెల్లిస్తామని భట్టి హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంఘాల అభ్యర్థన మేరకు మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నర్సింగ్ డైరెక్టరేట్ను ఆమోదించామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారి స్వస్థలాల నుండి బదిలీ అయిన ఉద్యోగులను…వారి పాత ప్రాంతానికే పంపిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
అంగన్వాడీ కార్యకర్తల పదవీ విరమణ ప్రయోజనాలను 2 లక్షలకు పెంచారు. ప్రమాదంలో మరణించిన సందర్భంలో మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు వన్-టైమ్ సెటిల్మెంట్/ఎక్స్-గ్రేషియాగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం 380 మంది SHG సభ్యులు మరణించారని, వారికి రూ. 380.5 కోట్లు ఎక్స్-గ్రేషియాగా మంజూరు చేసామని మంత్రివర్గం తెలిపింది.
అలాగే కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ప్రతిపాదించిన మూడు కారిడార్లలో 86 కి.మీ.ల పొడవునా హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.19,570 కోట్లను ఆమోదించింది.
హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) మోడ్లో 5,190 కి.మీ.ల వరకు విస్తరించి ఉన్న (పంచాయతీ రాజ్) రోడ్ల నిర్మాణ పనులను 2 సంవత్సరాలలో అమలు చేసి సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీలు 15 సంవత్సరాల పాటు నిర్వహించాలని కూడా ఆమోదించారు.