న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ఎన్నికల రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ చేసిన వాదనలు వివాదానికి దారితీశాయి. ఈ అంశంపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని ఎన్నికలసంఘం కోరింది. అవకతవకలు జరిగినట్లు భావిస్తే హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది.
అంతేకాదు మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారంటూ రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించాయి. కాంగ్రెస్ అభ్యర్థులు స్వయంగా నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను రాహుల్ అనుమానిస్తున్నారని ఆక్షేపించాయి. అసెంబ్లీ ఎన్నికలపై అనుమానాలు నివృత్తి చేయడానికి గత నెల 15న కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తే ఎవరూ రాలేదని పేర్కొన్నాయి. ఎన్నికల్లో ప్రతికూల తీర్పు వస్తే ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడం అసంబద్ధమని స్పష్టంచేశాయి.
కాగా, ఈసీ స్పందించిన కొద్దిసేపటికే తిరిగి రాహుల్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక డేటాను బహిరంగం చేయాలని ఈసీని డిమాండ్ చేశారు. తీవ్రమైన అంశాలపై ఎగవేత ధోరణిలో ఈసీ స్పందించిందని, కమిషన్ తన విశ్వసనీయతను పునరుద్ధరించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
మీది రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ. సంతకం లేకుండా, మధ్యవర్తులతో ఎగవేత ధోరణిలో స్పందించడం సరైన పద్ధతి కాదు” అని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. మహారాష్ట్రతో సహా ఇటీవల అన్ని రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ, విధానసభల సమగ్రమైన డిజిటల్, మెషీన్-రీడబుల్ ఓటర్ల జాబితాను ప్రచురించాలని, మహారాష్ట్ర పోలింగ్ బూత్లతో సాయంత్రం 5 గంటల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. కాగా, 2009 నుండి ఓటర్ల జాబితాను పంచుకోవాలని EC యోచిస్తోంది.
మరోవంక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందీ సమీక్ష చేసుకోకుండా ప్రజాతీర్పును రాహుల్ అపహాస్యం చేస్తున్నారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేయగా. RJDకి చెందిన తేజస్వి యాదవ్ రాహుల్కు మద్దతుగా నిలిచారు. మోడీ హయాంలో రాజ్యాంగ సంస్థలు “హైజాక్” అయ్యాయని ఆరోపించారు.