కోల్కతా: ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న ‘ఆపరేషన్ కాగర్’లో మావోయిస్టు నాయకుల ఎన్కౌంటర్ హత్యలను వ్యతిరేకిస్తూ ఐదు వామపక్ష పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంయుక్త లేఖ రాశాయి. ఆపరేషన్ కాగర్ పేరుతో ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్న “న్యాయేతర” హత్యలను వెంటనే నిలిపివేయాలని ఐదు వామపక్ష పార్టీలు ప్రధానమంత్రికి సంయుక్త లేఖ రాశాయి.
“చాలా మంది సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రస్తుతం భద్రతా దళాల అదుపులో ఉన్నారని అనేక నివేదికలు ఉన్నాయి. వారందరినీ కోర్టులో హాజరుపరచాలని, చట్టం ప్రకారం వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము” అని లేఖలో పేర్కొన్నారు.
భద్రతా దళాల చర్య కారణంగా ఈ ప్రాంతంలోని గిరిజన ప్రజల సాధారణ జీవితాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఐదు వామపక్ష పార్టీలు లేఖలో పేర్కొన్నాయి.
“రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో పొందుపరచిన ఆదివాసీ హక్కులు క్రమపద్ధతిలో ఉల్లంఘనకు గురవుతున్నాయి. మరోవంక ఛత్తీస్గఢ్లోని అడవులు, ఖనిజాలు విచక్షణారహితంగా కార్పొరేట్ దోపిడీకి గురవుతున్నాయి, దీని వలన పర్యావరణ భద్రత, స్థానిక ప్రజల జీవనోపాధిపై వినాశకరమైన ప్రభావాలు సంభవిస్తున్నాయి. ఆదివాసీలను అణగదొక్కే ఈ సైనిక విధానాన్ని ఆపాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము” అని లేఖలో పేర్కొన్నారు.
ఎన్కౌంటర్లలో మరణించిన వారి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించలేదని, అందువల్ల గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వలేకపోయామని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం వైఖరేనని ఆ లేఖలో ఆరోపించారు.
“చర్చల కోసం తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని మావోయిస్టులు ప్రభుత్వాన్ని పదేపదే కోరారు. దురదృష్టవశాత్తు, కేంద్ర ప్రభుత్వం, బిజెపి నేతృత్వంలోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకోవడం లేదు. బదులుగా వారు హత్యలు, వినాశనం అనే అమానవీయ విధానాన్ని అనుసరిస్తున్నారు” అని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనలు కూడా కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనేందుకు సిద్ధంగా లేదని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి.