జెరూసలేం : గాజాపై ఇజ్రాయెల్ దమనకాండ కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబర్ నుండి గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ చేస్తున్న జాతి విధ్వంస యుద్ధంలో కనీసం 54,927 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత 24 గంటల్లో 47 మృతదేహాలను ఆసుపత్రులకు తరలించామని, 388 మంది గాయపడ్డారని, ఇజ్రాయెల్ దాడిలో మొత్తం గాయపడిన వారి సంఖ్య 1,26,615కి చేరుకుందని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. “రెస్క్యూ సిబ్బంది వారిని చేరుకోలేక పోవడంతో చాలా మంది బాధితులు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు.
మార్చి 18న ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్పై తన దాడులను తిరిగి ప్రారంభించింది. అప్పటి నుండి ఇజ్రాయెల్ 4,649 మందిని చంపి 14,574 మందిని గాయపరిచింది. జనవరిలో జరిగిన కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని కూడా ఇజ్రాయెల్ ఉల్లంఘించింది.
గత నవంబర్లో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్లపై గాజాలో యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
ఇజ్రాయెల్ కూడా గాజా ఎన్క్లేవ్పై యుద్ధం చేసినందుకు అంతర్జాతీయ న్యాయస్థానంలో జాతి నిర్మూలన కేసును ఎదుర్కొంటోంది.