న్యూఢిల్లీ: కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జీ-7 సమ్మిట్కు హాజయరయ్యారు. ఈరోజు ఆల్బెర్టాలో జరిగిన G7 సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో సమావేశం అయ్యారు. గత సంవత్సరం జస్టిన్ ట్రూడో ప్రభుత్వ హయాంలో క్షీణించిన సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాలనే ఆశ వారి ద్వైపాక్షిక సమావేశం కలిగించింది.
కాగా, కెనడా ప్రధాని కార్నీతో జరిగిన సమావేశంలో, ప్రధానమంత్రి మోడీ “భారతదేశం-కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవి” అని నొక్కి చెప్పారు. “ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి మేము కలిసి పని చేస్తాము” అని ఆయన అన్నారు.
కెనడా ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పరస్పర గౌరవం, చట్ట పాలన, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత సూత్రానికి నిబద్ధత ఆధారంగా కెనడా-భారతదేశ సంబంధాల ప్రాముఖ్యతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.
“ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ చర్యను వేగవంతం చేయాలని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ X పోస్ట్లో పేర్కొన్నారు.
ఇరుపక్షాలు తమ ప్రజల మధ్య బలమైన, చారిత్రాత్మక సంబంధాలు, ఇండో-పసిఫిక్లో భాగస్వామ్యాలు, కెనడా, భారతదేశం మధ్య ముఖ్యమైన వాణిజ్య సంబంధాలను చర్చించాయి. ఇంధన పరివర్తన వంటి రంగాల్లో భాగస్వామ్యాలతో సహా వారు చర్చించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
జీ7 ఎజెండాలోని ముఖ్య అంశాలైన అంతర్జాతీయ నేరాలు, అణచివేత, భద్రత, నియమాల ఆధారిత క్రమాన్ని కూడా ప్రధాని మార్క్ కార్నీ ప్రస్తావించారు. టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆహార భద్రత సహా కీలక ఖనిజాలకు సంబంధించి చర్చలు జరిపారు.
మొత్తంగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్-కెనడా సంబంధాలు ఇప్పటికీ కొంత ఒత్తిడిలోనే ఉన్నమాట వాస్తవం. కెనడాలో తీవ్రవాదం, భారత్ వ్యతిరేక కార్యకలాపాలపై మోదీ సర్కార్ పదేపదే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాంటి శక్తులపై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరుతోంది. తాజాగా మోడీ-కార్నీ భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.