హైదరాబాద్: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO), తెలంగాణ జోన్, ఇటీవలి ఇజ్రాయేల్ దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ ప్రజల పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా, SIO ప్రధాన కార్యదర్శి అడ్వొకేట్ అనీస్ ఉర్ రెహ్మాన్, రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫరాజ్ అహ్మద్, కార్యదర్శి మొహమ్మద్ హమ్మాద్దుద్దీన్, మిగతా బృందం ఇరాన్ కాన్సుల్ జనరల్ మహ్దీ షారోఖీని కలసి తమ సంఘీభావం వ్యక్తపరిచారు. ఈ విషాద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎస్ఐఓ తరుపున హృదయపూర్వక సానుభూతిని తెలియజేసారు.
ఇజ్రాయేల్ చేపట్టిన తాజా దాడులు అంతర్జాతీయ చట్టాలను, దౌత్య పరంపరను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. మానవతా సదాచారాలను ఉల్లంఘించే విధంగా జరిపిన ఈ దాడులు, జాతీయ స్వతంత్రత, ప్రాణాల పవిత్రత, అంతర్జాతీయ న్యాయానికి గౌరవం వంటి అంశాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
భారత్-ఇరాన్ సంబంధాలు శతాబ్దాల నాటి నాగరికత, సాంస్కృతిక, దౌత్య నేపథ్యంలో బలంగా నిలిచినవే. అలాంటి సమయంలో, భారత పౌరులుగా, ఒక బాధ్యతాయుత విద్యార్థి సంస్థగా మేము ఇరాన్ ప్రజలకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. —ఈ ఉద్రిక్తతలు దౌత్యపరమైన చర్చల ద్వారా, అంతర్జాతీయ సహకారంతో త్వరగా పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని ఎస్ఐఓ నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇరాన్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల, ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ నుంచి వెళ్లినవారి భద్రత పట్ల మా ఆందోళనను వ్యక్తపరుస్తున్నామని తెలంగాణ SIO రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫరాజ్ అహ్మద్ చెప్పారు—భారత ప్రభుత్వం, టెహ్రాన్లోని దౌత్య మిషన్ సమన్వయంతో, భారత విద్యార్థుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.