ఇస్లామాబాద్: పాకిస్థాన్ భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికిపైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయని పాక్ మంత్రి ఒకరు వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించేందుకు హెలికాప్టర్ దిగేందుకు కూడా స్థలం లేకపోవడంతో అక్కడి ప్రజలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జులై నుంచి దేశంలో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.
ఇప్పటి వరకు దేశంలోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు పాక్ నేషల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) తెలిపింది. 2010లో పాకిస్థాన్ చూసిన సూపర్ ఫ్లండ్ కంటే ఇది తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వరదల కారణంగా ఇప్పటి వరకు 1136 మంది మరణించారు. 4,52,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 2,18,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. దాదాపు 8లక్షల పశువులు చనిపోగా, 20లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ఎన్డీఎంఏ పేర్కొంది.
పాకిస్థాన్లో రుతుపవనాల వల్ల ఆకస్మికంగా వచ్చిన వరదలతో సుమారు 33 మంది మిలియన్ల ప్రజలు ప్రభావితమయ్యారు. దేశంలోని 15 శాతం జనాభా వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వర్షాల వల్ల రోడ్లు, పంటలు, ఇండ్లు, వంతెనలు, ఇతర మౌళిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రానున్న రోజుల్లో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని మంత్రి ఇక్బాల్ తెలిపారు. 2010లో వచ్చిన వరదల కన్నా ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు.. 2010లో వరదల వల్ల దేశంలో రెండు వేల మందికిపైగా మరణించారు. 2010లో పాకిస్థాన్ చవిచూసిన ‘సూపర్ ఫ్లడ్’ కంటే ఇది తీవ్రమైంది అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా వరదల వల్ల సుమారు 10 బిలియన్ల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని ఆ దేశ మంత్రి అహసాన్ ఇక్బాల్ పేర్కొన్నారు.
వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు తెలిపారు, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని వేలాది గ్రామాలు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి సంబంధాలు తెగిపోయాయని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది.
పాకిస్థాన్ లో వరదల బీభత్సాన్ని ఉద్దేశించి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి బాధపడ్డానని, ఈ ప్రకృతి వైపరిత్యంలో బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి, నష్టపోయిన వారందరికీ మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. త్వరగా ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని కోరారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా తన పాకిస్థాన్ ప్రధాని ఆరిఫ్ అల్వీకి సంతాప సందేశాన్ని పంపారు. పాకిస్తాన్కు అత్యవసరంగా అవసరమైన సహాయాన్ని అందించడం కొనసాగిస్తామని, విపత్తు సహాయక చర్యలో ఆ దేశానికి మద్దతు ఇస్తామని చైనా తెలిపింది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ మాట్లాడుతూ వరదల కారణంగా పాకిస్థాన్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగడం పట్ల తాను చాలా బాధపడ్డానని, ఆ దేశానికి యునైటెడ్ కింగ్డమ్ సంఘీభావంగా నిలుస్తుందని పేర్కొంది.
“నా ఆలోచనలు… సహాయక చర్యలో భాగంగా బాధితులకు సహాయం చేస్తున్న వారి వైపు వెళుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ మీకు మద్దతును పంపుతోంది. పాకిస్తాన్ ప్రజలకు అవసరమైన సమయంలో బ్రిటన్ అండగా నిలుస్తోంది” అని బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు.
కెనడా ప్రభుత్వం పాకిస్థాన్లో వరద సహాయక చర్యల కోసం ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ సొసైటీలకు 20,000 డాలర్లు కేటాయించిందని కెనడా అంతర్జాతీయ అభివృద్ధి మంత్రి హర్జిత్ సజ్జన్ తెలిపారు.
వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాను సోమవారం ప్రత్యేక సాయం అందించింది ఐఎంఎఫ్. ఆదేశానికి 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఐఎంఎఫ్ రిలీజ్ చేసింది.