హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఎ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్పై హైదరాబాద్ పోలీసులు గురువారం ఇక్కడ కేసులు నమోదు చేశారు. భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కోసం జింఖానా గ్రౌండ్స్లో టిక్కెట్ల విక్రయంలో గందరగోళం నెలకొనడంతో ఈ కేసులు నమోదయ్యాయి. తొక్కిసలాటలో పలువురు గాయపడగా మరికొంత మందిని ఆస్పత్రికి తరలించారు.
తొక్కిసలాటలో గాయపడ్డ అదితి ఆలియా, ఎస్ఐ ప్రమోద్ ఫిర్యాదులతో కేసులు పెట్టారు. ప్రధానంగా హెచ్సీఏపై టికెట్ నిర్వాహణ, బ్లాక్లో అమ్మారన్న ఆరోపణలపై సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఈ తొక్కిసలాటకు కారణం హెచ్సీఏ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ ఇష్యూపై గాయపడ్డ వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టికెట్ల అమ్మకంలో సరైన జాగ్రత్తలు పాటించలేదని, అందువల్లే జింఖానాలో తొక్కిసలాట జరిగిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెసీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదంటున్నారు.
ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో భారత్ – ఆసీస్ టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టికెట్ల అమ్మకాల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో టికెట్లను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచే మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. టికెట్లు కొనుక్కునేందుకు ప్యారడైజ్ సర్కిల్ నుంచి జింఖానా వరకు క్యూలైన్ ఏర్పాటు చేశారు. అయితే, అంచనాలకు మించి వేలాదిగా క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. టికెట్ల అమ్మకం స్లోగా జరగడం, ఆన్లైన్ పేమెంట్స్కు అనుమతించక పోవడంతో అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా గేటెక్కి లోపలికి తోసుకుపోయేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
టికెట్ల విక్రయంలో మా ప్రమేయం లేదు
ఈ అంశంపై అజర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ‘టికెట్ల విక్రయాన్ని థర్డ్ పార్టీకి అప్పగించాం. మొత్తం వ్యవహారం వాళ్లే చూసుకున్నారు. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. అలాంటప్పుడు జరిగిన తప్పిదానికి మమ్మల్ని ఎందుకు బాధ్యులు చేస్తున్నారు. మేము కలుగజేసుకున్నట్లు ఎక్కడ ఆధారాలు లేవు. జింఖానాలో గురువారం జరిగిన ఉదంతం నిజంగా బాధాకారం. దానికి మమ్మల్ని విమర్శించడం సరికాదు. కొన్ని టికెట్లు ఆన్లైన్లో, మరికొన్ని ఆఫ్లైన్లో అమ్మినప్పుడు మేము ఎట్లా కలుగజేసుకుంటాం. బ్లాక్లో ఎవరైనా టికెట్లు అమ్మినట్లు తేలితే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఎవరన్న టికెట్ కొన్న తర్వాత వాళ్లు బ్లాక్లో అమ్ముతున్నారా, ఇంకా ఏం చేస్తారన్నది మాకు ఎలా తెలుస్తుంది. కొన్ని విషయాలు మా పరిధిలో ఉండవు. ఏది ఏమైనా ప్రభుత్వ సహకారంతో మ్యాచ్ను విజయవంతంగా నిర్వహిస్తాం’ అని అన్నారు.