న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపు ఆరోపణలు కలకలం రేపాయి. ఇక్కడి ఓ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు చెందిన అనేక మంది మహిళా విద్యార్థులు ఈ మేరకు ఆశ్రమ స్వామీజీపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు స్వయం ప్రకటిత కీచక దేవుడిపై కేసు నమోదు చేశారు. అయితే సదరు స్వామీజీ మాత్రం నిఘా ఉన్నప్పటికీ పోలీసులు కళ్లుగప్పి చల్లగా జారుకున్నాడు.
ఆగస్టు 4న వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడు ఇన్స్టిట్యూట్లో సంచాలక్ పనిచేస్తున్నాడు. కాగా, శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో EWS స్కాలర్షిప్ కింద చదువుతున్న 32 మంది మహిళా PGDM విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
వీరిలో 17 మంది అమ్మాయిలు స్వామీ చైతన్యానందపై ఆరోపణలు చేశారు. ద్వేషపూరిత భాషను వాడుతున్నారని, శృంగారభరిత టెక్ట్స్ మెసేజ్లు చేస్తున్నారని, భౌతికంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నారని మహిళలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. డైరెక్టర్కు లొంగిపోవాలని ఆ ఆశ్రమంలోని మహిళా సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కూడా వత్తిడి చేస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు.
ఆశ్రమంలో పనిచేస్తున్న వార్డెన్లు.. స్వామీజీకి తమను పరిచయం చేసినట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్వామీ చైతన్యానందపై లైంగిక వేధింపుల కేసు బుక్ చేసినట్లు డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ను పరిశీలించారు. నిందితుడి అడ్రస్లో తనిఖీలు చేశారు. ఆ స్వామీజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్రా వద్ద ఆయన ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడ గాలింపు చేపట్టారు.
భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. 16 మంది బాధితులు తరువాత మేజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు.
దర్యాప్తు సమయంలో ఇన్స్టిట్యూట్ బేస్మింట్లో ఉన్న వోల్వో కారును పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు. ఆ వాహనాన్ని స్వామీ చైతన్యానంద వాడినట్లు గుర్తించారు. అయితే ఆ కారుకు నకిలీ డిప్లమాటిక్ నెంబర్ ప్లేట్ఉన్నట్లు తేల్చారు. ఆ కారును ప్రస్తుతం సీజ్ చేశారు. నిందారోపణలు రావడంతో.. ఆశ్రమ అడ్మినిస్ట్రేషన్ ఆ స్వామీజీని తొలగించింది. అతడు చేసిన చట్టవిరుద్ధమైన చర్యలకు సంబంధించి సంబంధిత అధికారులకు పీఠం ఫిర్యాదులు కూడా చేసిందని పేర్కొంది.
ఆ కీచక స్వామీజీని కనిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, పలు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. అతను దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి విమానాశ్రయాలలో బృందాలు గట్టి నిఘా ఉంచాయని కూడా వర్గాలు తెలిపాయి.
“ఢిల్లీ, పొరుగు రాష్ట్రాలలోని అతని రహస్య స్థావరాలపై బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి” అని అధికారి తెలిపారు.