తిరువనంతపురం: నవంబర్నుంచి రెండో దశ ఎస్ఐఆర్ చేపట్టాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు, ఇది ప్రజాస్వామ్య సమగ్రతకు “తీవ్రమైన సవాలు” అని అభివర్ణించారు. ఎస్ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాను…కేంద్రం తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని ఆరోపించారు.
ఈ చర్య ఎన్నికల కమిషన్ ఉద్దేశాలపై సందేహాన్ని కలిగిస్తుందని, అంతేకాకుండా ఎన్నికల వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని విజయన్ ఆరోపించారు. ప్రస్తుత జాబితాలకు బదులుగా పాత 2002–2004 ఓటరు జాబితాల సవరణ చేయాలని ECI యోచిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలా చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నియమాలు-1960ని స్పష్టంగా ఉల్లంఘిస్తుందని విజయన్ అన్నారు.
ఆధార్ ఆధారంగా ప్రస్తుత ఓటర్ల జాబితాను సవరించాలని ఈ చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు. తమ రాష్ట్రం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎస్ఐఆర్ నిర్వహించడం అసాధ్యమని, ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లామని ముఖ్యమంత్రి తెలిపారు. అయినప్పటికీ ఈసీ ఎస్ఐఆర్ నిర్వహించాలనడం పలు అనుమానాలకు ఆజ్యం పోస్తుంది” అని విజయన్ హెచ్చరించారు.
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ సహా ఎనిమిదిచోట్ల నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు SIR చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఎస్ఐఆర్ కసరత్తు ద్వారా బోగస్ ఎంట్రీలను తొలగించడమే లక్ష్యమని ఈసీ చెబుతోంది. అయితే ఈ నిర్ణయం రాజకీయ తుఫానులను రేకెత్తించింది. పలు రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో ఈసీపై విరుచుకుపడుతున్నాయి.
ఏదైనా సవరణ చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడి ఉండాలని, రాష్ట్రాల ఎన్నికల క్యాలెండర్లను గౌరవించి ఎస్ఐఆర్ ప్రణాళికను ఉపసంహరించుకోవాలని సీఎం విజయన్ ఈసీని అభ్యర్థించారు. అలా చేయడంలో విఫలమైతే, కీలకమైన ఎన్నికలకు ముందు భారతదేశ ప్రజాస్వామ్యం పునాది క్షీణిస్తుందని ఆయన సూచించారు.


