న్యూఢిల్లీ: అక్రమవలసదారులపై అగ్రరాజ్యం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపేశారు. ఈ లెక్కలను స్వయంగా భారత ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు యూఎస్ లో అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారని చెప్పారు.
అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేయడానికి అమెరికన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. హెచ్ 1బీ వీసా, విద్యార్థి వీసా, టూరిస్ట్ వీసా గడువు ముగిసినా లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా.. అక్రమంగా సరిహద్దు దాటినా ఇలాంటి బహిష్కరణలు జరుగుతున్నాయి. ఇన్ని వేల మంది భారతీయులు ఇంత తక్కువ సమయంలో బహిష్కరణకు గురి కావడం ఇదే మొదటి సారని తెలుస్తోంది. మరోవైపు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన భారతీయ పౌరుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నాలుగేండ్లలో కనిష్ట స్థాయికి చేరింది.
భారత్-అమెరికా మధ్య ఉన్న చట్టపరమైన, దౌత్య విధానాలను అనుసరించే బహిష్కరణలు జరిగాయని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికాతో పాటు ఈ ఏడాది యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య గురించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ‘యూకే నుంచి ఈ ఏడాది సుమారు వంద మంది భారతీయులను బహిష్కరించారు. వారి జాతీయతను కూడా ధ్రువీకరించిన తర్వాతే యూకే ఈ చర్యలు తీసుకుంది’ అని ఆయన తెలిపారు.


