న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో గందరగోళం కొనసాగుతోంది. నేడు వివిధ విమానాశ్రయాలలో ఏకంగా 400 పైగా విమానాలను రద్దు చేసారు.పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచాయని వర్గాలు తెలిపాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. ఈ పరిణామంతో ఇండిగో 550పైగా విమానాలను రద్దు చేసినట్లయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి విమాన సర్వీసులను పూర్తిగా పునరుద్ధరిస్తాం..అని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీ విమానాశ్రయంలో బయలుదేరే, రాకపోకలు సహా 220 కి పైగా విమానాలు రద్దు చేయగా, బెంగళూరు విమానాశ్రయంలో 100 కి పైగా విమానాలు రద్దు చేసామని ఆ వర్గాలు పిటిఐకి తెలిపాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో 90 కి పైగా విమానాలు రద్దు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇతర విమానాశ్రయాలలో కూడా రద్దులు జరిగాయి. చాలా విమానాలు ఆలస్యం అయ్యాయి. క్యాబిన్ సిబ్బంది ఇబ్బందులు,ఇతర కారణాల వల్ల ఇండిగో నిర్వహణ అంతరాయాలతో సతమతమవుతోంది.
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇండిగో విమాన అంతరాయాలకు సంబంధించిన పరిస్థితిని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిశితంగా పరిశీలిస్తున్నాయి.
ఈ సంక్షోభానికి ప్రధానకారణం…ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నూతన దశ అమలులో వచ్చిన మార్పులు… క్రూ ప్లానింగ్లో లోపాలు, శీతాకాలం కారణంగా ఆపరేషనల్ పరిమితులు, సిబ్బంది కొరతగా డీజీసీఏ సమీక్షలో తేలాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల నుంచి ఎయిర్బస్ ఏ320 విమానాలకు మినహాయింపు కల్పించాలని డీజీసీఏను కోరింది. డీజీసీఏ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు.
కాగా, ఈ సమస్యపై ఇండిగో…. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పింది. ‘సాంకేతిక, నిర్వహణాపరమైన సమస్యలు, విమానాశ్రయాల్లో నెలకొన్న రద్దీ కారణంగా గత రెండు రోజులుగా మా సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. దీనిని నివారించటానికి చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన చోట్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. రీఫండ్ ఇస్తున్నాం’ అని తెలిపింది.


