డమాస్కస్: సిరియాలో బషర్ అల్-అసద్ పాలన కూలిపోయి ఏడాది పూర్తయింది. దాదాపు 14 సంవత్సరాల యుద్ధం తర్వాత డిసెంబర్ 8, 2024న తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్ను స్వాధీనం చేసుకోవడంతో అసద్ సిరియాను విడిచిపెట్టి పారిపోయారు. దీంతో ఆయన 24 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. కాగా, అల్-అసద్ రష్యాకు పారిపోయాడు, అక్కడ అతనికి ఆశ్రయం లభించింది.
సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా బలమైన సిరియాను పునర్నిర్మిస్తానని” ప్రతిజ్ఞ చేశారు. కానీ అసద్ పతనం తర్వాత కూడా దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్ దాడులు వంటి ఘర్షణలు కొనసాగుతున్నాయి, ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. దేశం స్థిరత్వం వైపు వెళ్లకుండా అంతర్గత, బాహ్య ఘర్షణలతో సతమతమవుతోంది.
ఈ విషయమై సిరియా అధ్యక్షుడు తాజాగా దోహా సదస్సులో మాట్లాడుతూ… ఇజ్రాయెల్ దేశం కొత్త శత్రువుల కోసం వెతుకుతోందని తెలిపారు. సిరియాలో ఏడాది క్రితం తాను అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రాంతీయ శాంతి, స్థిరత్వం విషయంలో సానుకూల సందేశాలు పంపుతున్నట్లు తెలిపారు. అయితే, ఇజ్రాయెల్ తన ప్రతిపాదనలను తిరస్కరించినట్లు చెప్పారు.
హమాస్ ఉగ్రవాదులతో ఘర్షణను ఇజ్రాయెల్ ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోందని, భద్రత పేరుతో తన దూకుడును సమర్థించుకుంటోందని అల్-షరా విమర్శించారు. తమ దేశం ఆ విధంగా ప్రవర్తించదని చెప్పారు. సిరియా భూభాగం నుంచి టెల్అవీవ్ తన బలగాలను ఉపసంహరించుకోవాలని, 1974 యుద్ధ విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరారు.
మరోవంక సిరియా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇజ్రాయెల్కు సూచించారు.


