పాలస్తీనా: శీతాకాలపు తుఫాను కారణంగా రాత్రిపూట కురిసిన భారీ వర్షాలతో గాజాలో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్న వందలాది టెంట్లు వరదల్లో మునిగిపోయాయి. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు నిరంతరం వర్షం కురవడంతో టెంట్లు నీట మునిగాయి. దీంతో ఇజ్రాయెల్ రెండేళ్లుగా సాగించిన మారణహోమం కారణంగా ఇప్పటికే నిర్వాసితులైన కుటుంబాల పరిస్థితులు మరింత దిగజారాయని అనడోలు వార్తాసంస్థ ప్రతినిధి తెలిపారు.
దక్షిణాన రఫాలో డజన్ల కొద్దీ టెంట్లు పూర్తిగా మునిగిపోయిన తర్వాత వాటిని ఖాళీ చేయించినట్లు గాజా పౌర రక్షణ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 10, 2025న సెంట్రల్ గాజాలో చల్లని గాలులు, వర్షాల మధ్య కఠినమైన శీతాకాల పరిస్థితులను తట్టుకోవడంలో పాలస్తీనియన్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. బురైజ్ శరణార్థి శిబిరానికి తూర్పున ఉన్న తాత్కాలిక గుడారాలలో నిర్వాసిత పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. వీరి చుట్టూ భారీగా దెబ్బతిన్న భవనాలు, శిథిలాలు ఉన్నాయి.
గాజా ఎన్క్లేవ్ అంతటా ఉన్న నిర్వాసిత శిబిరాల్లో 2,50,000 కంటే ఎక్కువ కుటుంబాలు… చలి వాతావరణంతో పాటు వర్షపు నీటికి మునిగిపోయిన గుడారాల కారణంగా అష్టకష్టాలకు గురవుతున్నాయని ఏజెన్సీ ప్రతినిధి మహమూద్ బసల్ వాపోయారు.
తుఫాను ఇలాగే కొనసాగిన పక్షంలో, ముఖ్యంగా నిర్వాసితులకు తాత్కాలిక ఆశ్రయాలు అందుబాటులో లేకపోతే, అక్కడ పరిస్థితులు మరింత దిగజారిపోతాయని ఏజెన్సీ హెచ్చరించింది.
బుధవారం నుండి, ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన నివాసముంటున్న వేలాది టెంట్లు నీటి మడుగులుగా మారాయి, పరుపులు, దుస్తులు, ఆహార సామాగ్రి తడిసిపోయాయి, వందలాది పాలస్తీనియన్ కుటుంబాలు చలికి అల్లాడాయి.
మీడియా కార్యాలయం నుండి వచ్చిన ముందస్తు డేటా ప్రకారం… ఇజ్రాయెల్ తన రెండు సంవత్సరాల మారణహోమ యుద్ధంలో మౌలిక సదుపాయాలను నాశనం చేసిన తర్వాత పాలస్తీనియన్ల ప్రాథమిక ఆశ్రయ అవసరాలను తీర్చడానికి గాజాకు దాదాపు మూడు లక్షల టెంట్లు అవసరమవుతాయి.
కాగా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా 70వేల మందికి పైగా పాలస్తీనియన్లను చనిపోయారు. మరో లక్షా 71వేల మందికి పైగా గాయపడ్డారు. ఇక గాజా పునర్నిర్మాణ ఖర్చు సుమారు $70 బిలియన్లుగా UN అంచనా వేసింది. అక్టోబర్ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.


